- రష్మికతో సొంతూరికి విజయ్ దేవరకొండ
- ఫాం హౌస్లో కొత్త జంట గృహ ప్రవేశం
- సందడిగా గ్రామం
ఇంటర్నెట్ డెస్క్, మహా : స్టార్ హీరో విజయ్ దేవరకొండ తన భార్య రష్మికతో కలిసి తన సొంతూరు తుమ్మనపేటలో సందడి చేశారు. సోమవారం ఉదయం ఫ్యామిలీతో కలిసి గ్రామానికి చేరుకున్న ఆయనకు ఊరి ప్రజలు ఘన స్వాగతం పలికారు. డప్పులు, వాయిద్యాలతో ఊరేగింపుగా కొత్త జంటకు ఆహ్వానం పలికిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు నిండు మనసుతో ఆశీర్వదించారు. విజయ్ స్వస్థలం తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్ మండలంలోని తుమ్మనపేట గ్రామం. ఓ మారుమూల గ్రామం నుంచి వచ్చిన విజయ్ తన టాలెంట్తో ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగారు. తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.
పెళ్లి తర్వాత తన భార్య రష్మికతో కలిసి ఫస్ట్ టైం సొంతూరికి రావడంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. తన చిన్న నాటి స్నేహితులు అందరినీ ఆప్యాయంగా పలకరించారు విజయ్. తుమ్మనపేటలో నూతనంగా నిర్మించిన ఫామ్ హౌస్లో గృహ ప్రవేశం నిర్వహించారు. ఆ తర్వాత కొత్త దంపతులతో నూతన గృహంలో ఉదయం గం. 11.15 లకు తులసి పూజ అనంతరం సత్య నారాయణ వ్రతం జరిపించారు. ఈ వేడుకలో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు. తన గ్రామస్థుల సమక్షంలోనే ఈ వేడుక జరగాలని విజయ్ భావించగా కొత్త జంట సంబరంతో గ్రామంలో సందడిగా మారింది. కొత్త దంపతులను చూసేందుకు గ్రామస్థులతో పాటు చుట్టపక్కల గ్రామాల నుంచి భారీగా జనం తరలివచ్చారు. అభిమానులు, గ్రామస్థుల రాకతో విజయ్ దేవరకొండ ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానుల రద్దీ ఎక్కువగా ఉండటంతో స్థానిక పోలీసులు ముందస్తు జాగ్రతలు చేపట్టారు. ఎలాంటి ఘటనలు జరగకుండా జనాలను నియంత్రిస్తున్నారు.ఆంక్షలు విధించగా పాసులు అనుమతి ఉన్న వారికి మాత్రమే ప్రైవేట్ సెక్యూరిటీ సైన్యం వత్రం జరిగే మండపంలోకి అనుమతించారు. భద్రతా ఏర్పాట్లను అచ్చంపేట డీఎస్పీ పర్యవేక్షించారు. వ్రతం పూర్తి అయిన తర్వాత దాదాపు 2 వేల మంది వరకు భోజనాలు ఏర్పాట్లు చేశారు.
రాజస్థాన్లోని ఉదయపూర్లో ఫిబ్రవరి 26న విజయ్ దేవరకొండ, రష్మిక వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆ తర్వాత హైదరాబాద్ చేరుకున్న వీరు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో అభిమానులకు స్వీట్స్ పంపిణీ చేశారు. ఏపీ, తెలంగాణ సహా ప్రముఖ ఆలయాల్లో అన్నదానం కూడా చేశారు. వీరి అభిమానులు సైతం పలు గ్రామాల్లో అన్నదానం నిర్వహించారు.
4 న రిసెప్షన్
హైదరాబాద్లోని తాజ్ హోటల్లో మార్చి 4న వివాహ రిసెప్షన్ జరగనుంది. టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలతో పాటు పొలిటికల్ లీడర్స్ ఈ వేడుకకు హాజరు కానున్నారు. ఆదివారం రష్మిక తెలంగాణ సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసి రిసెప్షన్కు ఆహ్వానించారు. అలాగే, విరోష్ కపుల్ స్వయంగా అల్లు అరవింద్ ఇంటికి వెళ్లి వారి ఫ్యామిలీని ఆహ్వానించారు. కొత్త పెళ్లి కొడుకు అల్లు శిరీష్కు విషెష్ తెలిపారు. రిసెప్షన్ సందర్భంగా ఫ్యాన్స్కు స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. ఆహ్వానం ఉన్న అతిథులు మాత్రమే ఈవెంట్కు రావాలని విరోష్ కపుల్ విజ్ఞప్తి చేశారు. ఆహ్వానం లేకుండా వచ్చి ఇబ్బంది పడొద్దని సూచించారు. పోలీసుల ఆంక్షల నేపథ్యంలో ఇతరులు, అభిమానులు ఈ కార్యక్రమానికి వచ్చి ఇబ్బందుల పాలు కావొద్దని తెలిపారు. ఈ ఈవెంట్ ను ‘ఇన్వైట్ ఓన్లీ’ కార్యక్రమంగా నిర్వహించనున్నారు. . ఈ వెడ్డింగ్ రిసెప్షన్ కు రావాలిన ప్రధానమంత్రి మోదీని విజయ్, రష్మిక వెళ్లి స్వయంగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా ఆహ్వానించారు.








