Mahaa Daily Exclusive

  సికింద్రాబాద్ లో టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులు…. భారీగా కల్తీ అల్లం పేస్ట్ సీజ్….

Share

హైదరాబాద్, మహా : ప్రాణాంతక రసాయనాలతో అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న భారీ నెట్‌వర్క్‌ను సికింద్రాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ మరియు లాల్లాగూడ పోలీసులు శనివారం రట్టు చేశారు.ఈ దాడిలో తయారీదారులతో పాటు భారీగా ఉన్న కల్తీ అల్లం నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. లాలపేటలోని జనప్రియ అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఝాన్సీ అల్లం వెల్లుల్లి పేస్ట్ గోడౌన్‌పై టాస్క్ ఫోర్స్ టీమ్ ఆకస్మిక దాడి నిర్వహించింది. ఈ తనిఖీల్లో నాణ్యత లేని ముడి పదార్థాలతో పాటు ప్రమాదకరమైన రసాయనాలను కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నట్లు గుర్తించింది. ఈ కేంద్రాన్ని నడుపుతున్న నీలా వెంకటేశ్వర్లుతో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు.

అత్యంత హానికరమైన ఎసిటిక్ యాసిడ్, శాంతన్ గమ్ వంటి కెమికల్స్‌ను అల్లం-వెల్లుల్లి మిశ్రమంలో కలిపి తయారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆకర్షణీయమైన నకిలీ బ్రాండ్ లేబుల్స్‌తో నగరంలోని కిరాణా దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ మెరుపు దాడుల్లో పోలీసులు ఏకంగా 1,915 కిలోల కల్తీ పేస్ట్‌తో పాటు తయారీకి వాడే యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్లు 318(4), 275, 223 కింద కఠిన కేసులు నమోదు చేశారు. అపరిశుభ్రమైన వాతావరణంలో…. కుళ్లిన ముడి పదార్థాలతో తయారయ్యే ఇటువంటి కల్తీ పదార్థాల పట్ల జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు.

Latest