- పార్టీ మార్పుపై ఆలోచిస్తున్నా
- అవమానాలను ఇంకెంత కాలం భరించాలి
- పార్టీ మార్పు ప్రచారంపై కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి
జగిత్యాల, మహా : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ మార్పుపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కాంగ్రెస్ పార్టీలో కొనసాగడంపై పునరాలోచనలో ఉన్నానని, అవమానాలు ఇంకెంత కాలం భరించాలని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సమయం, సందర్భం వచ్చినపుడు నిర్ణయం తీసుకుంటానని, మంగళవారం జగిత్యాల కేంద్రంలోని ఇందిరా భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ తెలిపారు. ఇటీవల పార్టీ మారుతున్నారన్న ప్రచారంపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఏ అంశమైనా మీకు తెలియకుండా జరగదు, మున్సిపల్ ఎన్నికల ఫలితాల రోజే ఇక్కడ పరిస్థితి గురించి చెప్పాను, భవిష్యత్లో కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా? వద్దా అన్న నిర్ణయం త్వరలో చెబుతా అన్నారు.
పార్టీ మార్పుపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నేను ఏ నిర్ణయం తీసుకున్నా, కార్యకర్తలకు సంప్రదించి మీడియా ద్వారానే వెల్లడిస్తానని అన్నారు. ఇదిలా ఉంటే.. గత కొంత కాలంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ (బీఆర్ఎస్ నుంచి వచ్చినవారు)కు ప్రాధాన్యత ఇవ్వడం, మున్సిపల్ ఎన్నికల పరిణామాలపై జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బీజీపీ, బీఆర్ఎస్ నాయకులు తనను సంప్రదించారని వార్తలు వచ్చిన నేపథ్యంలో, ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.








