Mahaa Daily Exclusive

  పోలీస్ శాఖలో కొలువుల జాతర…..

Share

  • పోలీస్ శాఖలో కొలువుల జాతర
  • మెగా నోటిఫికేషన్ జారీకి రంగం సిద్దం
  • దాదాపు 18 వేల పోస్టుల భర్తీకి అవకాశం
  • రాష్ట్ర స్థాయి పోస్టుగా ఎస్సై పోస్టు

హైదరాబాద్, మహా : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోలీస్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. యూనిఫామ్ వేసుకోవాలనే లక్ష్యంతో ఉన్న వేలాది మంది యువతీ యువకులకు ఈ ఏడాది ‘మెగా నోటిఫికేషన్’ లభించే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర పోలీస్ విభాగంలో ఏటా పెరుగుతున్న ఖాళీలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి భారీ ఎత్తున నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2026 ఫిబ్రవరి చివరి నాటికి అందుబాటులో ఉన్న ఖాళీలపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందింది. పోలీసు శాఖ అందించిన గణాంకాల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 95,361 పోలీసు పోస్టులు మంజూరవ్వగా, ప్రస్తుతం కేవలం 77,369 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. అంటే దాదాపు 17,992 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. శాంతి భద్రతల పరిరక్షణలో ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ఈ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని పోలీస్ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ప్రభుత్వ ఆమోదం లభించిన వెంటనే నియామక ప్రక్రియ ప్రారంభం కానుంది. పోలీస్ ఎంపిక ప్రక్రియ సుదీర్ఘంగా సాగుతుంది కాబట్టి, ముందస్తుగానే అనుమతులు కోరుతూ ప్రతిపాదనలు పంపారు.

ఎస్సై పోస్టు ఇక రాష్ట్ర స్థాయి

పోలీసు పదోన్నతులకు సంబంధించి దశాబ్దాలుగా నెలకొన్న వివాదాలకు చెక్ పెట్టేందుకు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు జోన్ల వారీగా ఉన్న ఎస్సై పోస్టులను ఇకపై ‘రాష్ట్ర స్థాయి’ పోస్టులుగా మార్చబోతున్నారు. ఈ మేరకు సర్వీస్ రూల్స్‌లో మార్పులు చేస్తూ పంపిన ప్రతిపాదనలపై ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. అక్కడ ఆమోదం పొందితే, ఎస్సైల ట్రాన్స్ ఫర్, ప్రమోషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా జరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల పదోన్నతుల ప్రక్రియ మరింత వేగవంతం కానుంది._

ఖాతా తెరవనున్న నోటిఫికేషన్లు

కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత భారీ ఎత్తున నియామకాలు జరగనున్న నేపథ్యంలో, అభ్యర్థులు ఇప్పటి నుంచే తమ ప్రిపరేషన్‌ను వేగవంతం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సివిల్, ఏఆర్ విభాగాలతో పాటు ఇతర స్పెషల్ బెటాలియన్లలో కూడా పోస్టులు ఉండటంతో యూనిఫామ్ వేసుకోవాలని కల కంటున్న వేలాది మంది యువతకు ఇది ఒక సువర్ణావకాశం అని చెప్పవచ్చు_

సుదీర్ఘ ప్రక్రియ.. ముందే సన్నద్ధం కావాలి

పోలీసు ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ సాధారణ ఉద్యోగాల కంటే భిన్నంగా, క్లిష్టంగా కూడా ఉంటుంది. దేహదారుఢ్య పరీక్షలు మరియు రాత పరీక్షల నిర్వహణకు ఎక్కువ సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో, నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అభ్యర్థులు సిద్ధంగా ఉండేలా పోలీస్ శాఖ ముందస్తు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపింది. ఒకసారి అనుమతి లభిస్తే, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. శాఖలో పెరుగుతున్న పని ఒత్తిడిని తగ్గించడానికి, శాంతిభద్రతల పరిరక్షణను మరింత పటిష్టం చేయడానికి ఈ ఖాళీల భర్తీ అత్యవసరమని అధికారులు భావిస్తున్నారు. ఖాళీగా ఉన్న ఈ 18 వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రభుత్వం నుంచి తుది నిర్ణయం వెలువడితే, నిరుద్యోగులకు ఇది అతిపెద్ద శుభవార్త కానుంది.