Mahaa Daily Exclusive

  నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 20 శాతం కోటా: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడి

Share

  • రాబోయే పదవుల్లో
  • మహిళకు 20 శాతం ఛైర్మన్ లు
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో మహిళలకు పెద్దపీఠ
  • డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్టుబడడం సిగ్గుచేటు
  • మహిళా కాంగ్రెస్ ప్రమాణస్వీకారంలో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్

హైదరాబాద్, మహా
మహిళలకు అవకాశాలు ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ మొదటినుండీ ముందుంటుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. త్వరలో జరగనున్న నామినేటెడ్ పదవుల్లో 20 శాతం ఛైర్మన్ పదవులు మహిళలకే ఇస్తామన్నారు. ఆదివారం గాంధీభవన్ లో టీపీసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఎర్రబెల్లి స్వర్ణ పదవీ బాధ్యతలు స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మహేష్ కుమార్ గౌడ్, ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పదేళ్ల హయంలో డ్రగ్స్, గంజాయి, కొకైన్ పెంచి పోషించారని, వారి హయాంలో తెలంగాణ ను డ్రగ్స్ మయంగా మార్చారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఓ మాజీ ఎమ్మెల్యే ఫాంహౌజ్ లో డ్రగ్స్ దొరకడం, దానిలో బీఆర్ఎస్, టీడీపీ, రాజకీయ నేతలున్నారన్నంటే వారు సిగ్గుతో తలదించుకోవాలని మండిపడ్డారు. మహిళా సెంట్రిక్ గా ప్రజా పాలన నడుస్తోందని, మహిళ నేతలను రాష్ట్రపతి, గవర్నర్లు, సీఎంలు, స్పీకర్లను చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని, రాబోయే ఎన్నికల్లో 51 మంది మహిళా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉండబోతున్నారని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. రాబోయే పదవుల్లో 20 శాతం మహిళలకు చైర్మన్ పదవులు ఇవ్వాలనే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని, గడప గడపకు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను తీసుకెళ్లాలని ఆయన సూచించారు. అల్కా లాంబ మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ల కోసం సోనియా గాంధీ ఎంతో ప్రయత్నాలు చేశారని, ప్రస్తుతం రాహుల్, ప్రియాంకలు మహిళల రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నారని తెలిపారు. కేంద్రం మన హక్కులను నీరుగారుస్తున్నారని, మహిళలకు జరిగే అన్యాయాలపైన మనం గొంతులు విప్పి ప్రశ్నించాలని ఆమె పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే, ఎస్సీ సెల్ చీఫ్​కవ్వంపల్లి సత్యనారాయణ, ప్రోటోకాల్ ఇంచార్జ్ హార్కర్ వేణు గోపాల్ రావు, మహిళ కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సునీతా రావ్, మహిళా నేతలు గుండు సుధారాణి, కోట నీలిమ, నేరెళ్ల శారద తదితరులు పాల్గొన్నారు.