Mahaa Daily Exclusive

  కాంగ్రెస్ మునిగిపోయే పడవ….

Share

  • కాంగ్రెస్ మునిగిపోయే పడవ
  • ఆ పార్టీలో చేరేది లేదు
  • పార్టీ మార్పుపై మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి క్లారిటీ

హైదరాబాద్, మహా : కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే పడవ అని, ఆ పార్టీలో నేనెందుకు చేరుతానని మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గత కొన్నాళ్ళుగా మల్లారెడ్డి పార్టీ మార్పుపై జోరుగా ఊహాగానాలు గుప్పుమంటున్నాయి. ఆయన కారు దిగి హస్తం పార్టీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో మల్లారెడ్డి కుటుంబం సంప్రదింపులు జరుపుతోందని తెలుస్తోంది. తన కుటుంబ రాజకీయ భవిష్యత్ కోసం.. మల్లారెడ్డి పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో తాజాగా మల్లారెడ్డి స్వయంగా స్పందించి ఈ ఊహాగానాలకు తెరదించారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, అవన్నీ అసత్యాలేనని కొట్టిపారేశారు. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తనకు తెలుసని పేర్కొన్నారు.

అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన మల్లారెడ్డి.. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న ఊహాగానాలను కొట్టేశారు. ప్రస్తుతం తన వయసు 73 ఏళ్లు అని.. ఏ నిర్ణయం తీసుకోవాలో తనకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు. మునిగిపోయే పడవలో ఎవరైనా ఎక్కుతారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ లాంటిదని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి చెబుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ 11 ఏళ్లు కాకుండా 50 ఏళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ అది మునిగిపోయే పడవనే అని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఏ పార్టీ బలంగా ఉందో అందరికీ తెలుసని అన్నారు. ఇటీవలె తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశానని, తన పెళ్లిరోజు వేడుకలకు రావాలని ఆయనను ఆహ్వానించినట్లు మల్లారెడ్డి స్పష్టం చేశారు.

మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి వ్యాఖ్యలు వైరల్

మరోవైపు.. మల్లారెడ్డి చిన్న కుమారుడు భద్రారెడ్డి సతీమణి.. మల్లారెడ్డి విద్యాసంస్థలను చూసుకుంటున్న ప్రీతిరెడ్డి ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చాలంటూ ఆమె ఒక డిమాండ్‌ను తెరపైకి తీసుకువచ్చారు. అదే సమయంలో గత కొంతకాలంగా మేడ్చల్ నియోజకవర్గంలో చాలా యాక్టివ్‌గా ఉంటున్న ప్రీతి రెడ్డి.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రశంసలు గుప్పించడం గమనార్హం. మరీ ముఖ్యంగా నూతన జాతీయ విద్యా విధానం ద్వారా భారతదేశ విద్యా వ్యవస్థలో తీసుకువచ్చిన మార్పులు.. ఆర్థిక సంస్కరణలు, మహిళా సాధికారత వంటి వాటిపై ఆమె కేంద్రంపై పొగడ్తల వర్షం కురిపించారు. వీటన్నింటితోపాటు గతంలో కేంద్రమంత్రి బండి సంజయ్‍తో ప్రీతిరెడ్డి భేటీ కావడం అప్పట్లోనే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంతే కాకుండా ఆమె రాజకీయాల్లోకి రావాలని ఉందని.. ఎంపీ పదవిపై ఆసక్తి ఉందని పేర్కొనడం గమనార్హం.