- అన్న అనే పేరుకే కళంకం
- జగన్పై షర్మిల నిప్పులు
- కడప ఎంపీ టికెట్ కోసమే వివేకానంద రెడ్డి హత్య జరిగింది
- అవినాష్ రెడ్డే ఘాతుకానికి పాల్పడ్డారన్న షర్మిల
- సునిత, ఆమె భర్తపై అవినాష్ రెడ్డి ఆరోపణలపై మండిపాటు
అమరావతి, మహా : అన్న అనే పేరుకే జగన్ కళంకం అని వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆమె వివేకా హత్య కేసులో సునీత, ఆమె భర్తపై అవినాష్ రెడ్డి ఆరోపణలు చేయడాన్ని ఖండించారు. వివేకానంద రెడ్డి హత్య ముమ్మాటికీ కడప ఎంపీ టికెట్ విషయంలోనే జరిగిందని షర్మిల స్పష్టం చేశారు. కడప ఎంపీ పదవికి అవినాష్ రెడ్డి సరికాదని, ఆయనకు టికెట్ ఇవ్వవద్దని వివేకా స్వయంగా నాతో చెప్పారని ఆమె గుర్తు చేశారు. వివేకా బతికి ఉంటే తన రాజకీయ భవిష్యత్తుకు అడ్డంకి అవుతారని భావించే అవినాష్ రెడ్డి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. వివేకా వారించినా వినకుండా జగన్ మొండిగా అవినాష్కే టికెట్ ఇచ్చారని, ఈ హత్యను అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ధి పొంది జగన్ ముఖ్యమంత్రి అయ్యారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో వివేకా కేసు అంశంపై అవినాష్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.
మీడియా ద్వారా తప్పుడు ప్రచారం
హత్య జరిగిన సమయంలో సాక్షి మీడియా, వైఎస్ఆర్సీపీ అనుకూల వర్గాలు చేసిన ప్రచారాన్ని షర్మిల తీవ్రంగా ప్రశ్నించారు. వివేకాది సహజ మరణమని, గుండెపోటుతో చనిపోయారని సాక్షి మీడియా తొలుత వార్తలు ప్రచారం చేసిందని గుర్తు చేశారు. వివేకాను సునీత భర్తే హత్య చేసినట్లు చిత్రీకరించేందుకు అవినాష్ రెడ్డి విశ్వప్రయత్నం చేశారు కానీ, సునీత భర్త వివేకాను సొంత తండ్రిలా చూసుకునేవారు అని ఆమె స్పష్టం చేశారు. అప్పట్లో ఈ హత్యను టీడీపీపై నెట్టి రాజకీయ పబ్బం గడుపుకున్నారన్నారు. ఇప్పుడు కూడా సునీత, ఆమె భర్తపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వివేకా హత్య జరిగినప్పుడు హైదరాబాద్ లో ఉన్నారని గుర్తు చేశారు. సాక్ష్యాలు తుడిచేయడమే కాకుండా పోస్టుమార్టం కూడా వద్దని అవినాష్ రెడ్డి ఎందుకు ఒత్తిడి చేశారని షర్మిల ప్రశ్నించారు.
కోర్టు ద్వారానే సీబీఐ విచారణ
నాడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వివేకా హత్యపై సీబీఐ విచారణ కోరిన జగన్, ముఖ్యమంత్రి అయ్యాక మాత్రం సునీత ఎన్నిసార్లు ప్రాధేయపడినా ఎందుకు అంగీకరించలేదని షర్మిల ప్రశ్నించారు. ఐదేళ్లు అధికారంలో ఉండి కూడా ఈ కేసును కొలిక్కి తీసుకురావడంలో జగన్ విఫలమయ్యారని, కేవలం కోర్టు ఆదేశాల వల్లే ప్రస్తుతం సీబీఐ విచారణ జరుగుతోందని గుర్తు చేశారు. బాధితురాలు సునీత చేస్తున్న పోరాటంలో ఉన్న పట్టుదల, దర్యాప్తు సంస్థల్లో ఎందుకు కనిపించడం లేదు?” అని ఆమె నిలదీశారు.








