- త్వరలో “సాదాబైనామా” పరిష్కారం
- కొనుగోలుదారు అఫ్ఫిడవిట్ ఇస్తే సరిపోతుంది
- దరఖాస్తుదారులకు మేలు జరిగేలా జీ.ఓ. 76
- ఏప్రిల్ చివరి కల్లా భూభారతి పూర్తి పోర్టల్ సిద్ధం
- శాసన మండలిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
హైదరాబాద్, మహా : రాష్ట్రంలో 2020 నుంచి పెండింగ్ లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులను వీలైంనంత తొందరగా పరిష్కరిస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం అడిగిన ప్రశ్నకు మంత్రి గారు సమాధానం ఇస్తూ, ఆనాటి బిఆర్ఎస్ ప్రభుత్వం సాదబైనామాలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించిందని, కానీ 2020 ఆర్ఓఆర్ చట్టంలో పరిష్కారం మార్గం చూపించలేదన్నారు. భూ భారతి చట్టంలో ఈ సమస్యకు పరిష్కారం చూపించడం జరిగిందని, అయితే కొనుగోలుదారు అమ్మకందారు ఇద్దరి నుంచి అఫిడవిట్ తీసుకోవాలన్న నిబంధనను పొందుపరచడంవల్ల క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని కొనుగోలుదారు నుంచి మాత్రమే అఫిడవిట్ తీసుకోవాలని నిర్ణయించామని, ఈ మేరకు జీ.ఓ. 76 ను విడుదల చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 9 లక్షలకుపైగా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, వీటన్నింటికీ పరిష్కారం లభించబోతుందన్నారు.
ఆధార్ మాదిరిగానే భూధార్
నక్షా లేని 413 గ్రామాలకు గాను 5 గ్రామాలల్లో ప్రయోగాత్మమకంగా రీ సర్వే నిర్వహించామని, ఇందులో ప్రతీ సర్వే నెంబర్ కు ఆధార్ నెంబర్ మాదిరిగానే భూధార్ కేటాయించడం జరిగిందన్నారు. త్వరలో హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లో ప్రతీ జిల్లాలో 70 గ్రామాల్లో భూ సర్వే నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందని తెలిపారు. దశల వారిగా భూ సర్వే నిర్వహించి భూధార్ ను ఇస్తామని, రాష్ట్రం లోని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు.
అవినీతికి పాల్పడితే ఉపేక్షించం
ధరణి పోర్టల్ లోని లోసగులను ఆసరాగా చేసుకొని కొంత మంది మీ-సేవ నిర్వాహకులతో కలిసి 3.99 కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్మును కాజేశారని, దీనిపై ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపించామని తెలిపారు. తప్పుచేసిన వారి నుంచి ఆ సొమ్మును రికవరీ చేస్తామని ప్రకటించారు. ఇందులో అధికారుల పాత్ర ఉంటే ఏ స్థాయిలో ఉన్నా కూడా ఉపేక్షించబోమని సభ్యులు తాతా మధుసుదన్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఆనాడు ధరణి పోర్టల్ ను నాలుగు గోడల మధ్య ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా అర్ధరాత్రి తీసుకొచ్చారని, దీని వల్లే కొత్తగా భూ సమస్యలు పుట్టుకొచ్చాయని విమర్శించారు. ధరణి పోర్టల్ లో 40, 41 మాడ్యుల్స్ ఉంటే భూ భారతి పోర్టల్ లో 6 కు కుదించామని, ధరణి పోర్టల్ ను అర్ధరాత్రి ఒక్కరోజు మార్చేది కాదని, దశలవారీగా మార్పులు చేసుకుంటూ వస్తున్నామని, ఈ ఏప్రిల్ చివరి నాటికి పూర్తి స్థాయిలో భూ భారతి పోర్టల్ ను తెస్తామని తెలిపారు.






