- మొదటి దశ అభివృద్ధి పనులకు రూ.351 కోట్లు అనుమతులు మంజూరు
- మొత్తం అంచనా వ్యయం 586 కోట్లు
- నిధుల విడుదల చేసిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్, మహా: భద్రాచలం దేవస్థానం మరియు పట్టణ సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ముందడుగు వేసింది. దేవాదాయ శాఖ ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ, భద్రాచలం పునరాభివృద్ధి–పునరుజ్జీవన కార్యక్రమాల కోసం మొదటి దశలో భాగంగా రూ.351 కోట్ల పరిపాలనా అనుమతిని ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్ ఉత్తర్వులు జారీచేశారు..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఏడాది భద్రాచలం పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీకి అనుగుణంగా ఈ నిర్ణయం వెలువడటం విశేషం. ఈ ప్రక్రియలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ నిరంతర పర్యవేక్షణ, కృషి కీలక పాత్ర పోషించాయి. ఆమె తీసుకున్న ప్రత్యేక చొరవతో ప్రతిపాదనలు వేగంగా ఆమోదం పొందగా, ప్రభుత్వం ఇచ్చిన హామీని ప్నిలబెట్టుకుంది.
మొదటి దశలో గోదావరి ఘాట్ విస్తరణ, ఆధునిక వసతులతో అభివృద్ధి, ఆలయ సముదాయం విస్తరణ, పరిసర ప్రాంతాల సదుపాయాల మెరుగుదల వంటి ప్రధాన పనులు చేపట్టనున్నారు. ఇందుకోసం గోదావరి ఘాట్కు రూ.75 కోట్లు, ఆలయ సముదాయానికి రూ.180 కోట్లు, పరిసర అభివృద్ధికి రూ.96 కోట్లు కేటాయించారు. మొత్తం మూడు దశల్లో అమలు కానున్న ఈ ప్రాజెక్టులో రెండో దశలో కాపా రామలక్ష్మమ్మ భూమిలో రూపాంతరాత్మక అభివృద్ధి, మూడో దశలో భద్రాచలం పట్టణ సమగ్ర అభివృద్ధి చేపట్టనున్నారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.586 కోట్లుగా అంచనా వేయబడింది. అగమ శాస్త్రాలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధి పనులు చేపట్టబడతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. పనుల అమలును రోడ్లు -భవనాల శాఖకు అప్పగిస్తూ, నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని ఆదేశించింది.
ఈ ఉత్తర్వుల పట్ల మంత్రి కొండా సురేఖ సంతోషం వ్యక్తంచేశారు.. తమ ప్రభుత్వం చేతల ప్రభుత్వం అని,భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, భద్రాచలం క్షేత్ర వైభవాన్ని మరింత అభివృద్ధి చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుతో పర్యాటక రంగానికి కొత్త ఊపు లభించడంతో పాటు, స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా బలం చేకూరుతుందని తెలిపారు. ఈ నిర్ణయం భద్రాచలం అభివృద్ధి చరిత్రలో కీలక మలుపుగా నిలుస్తూ, ప్రాంతానికి నిజమైన మహర్దశకు నాంది పలుకుతోంది.







