Mahaa Daily Exclusive

  గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్ట్ ప్రతిష్టాత్మకమైనది – ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Share

ప్రపంచ స్థాయిలో ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టు గ్రీన్ కో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. శనివారం కర్నూలు జిల్లా పర్యటన లో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఓర్వకల్లు మండలం గని సమీపంలో ఉన్న సోలార్ పార్క్, గ్రీన్ కో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ ను హెలికాప్టర్ లో ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం గ్రీన్ కో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ లోని హెలిప్యాడ్ కు చేరుకుని పరిశీలించారు. అప్పర్ రిజర్వాయర్, అప్పర్ ఇన్ టేక్ పాయింట్, ప్రాజెక్ట్ సైట్, పవర్ హౌస్ తదితర ప్రాంతాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రాజెక్ట్ పనితీరు, రెన్యువబుల్ ఎనర్జీ ఉత్పత్తి గురించి కంపెనీ యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు.

అనంతరం డిప్యూటీ సిఎం పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టులలో గ్రీన్ కో కంపెనీకి చాలా ప్రతిష్టాత్మకమైన పేరు ఉందన్నారు. ఈ కంపెనీ ఇప్పటివరకు భారతదేశంలో రూ. లక్షన్నర కోట్లు పెట్టుబడి పెట్టారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ. 30 వేల కోట్లు పెట్టుబడి పెట్టారన్నారు. ఇవి కాకుండా అదనంగా మరో రూ. 20 వేల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నారన్నారు. 12,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించారని, పరోక్షంగా 50 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించారన్నారు. పిన్నాపురం ప్రాజెక్ట్ కు ఇప్పటివరకు రూ. 12 వేల కోట్లు పెట్టుబడి పెట్టారన్నారు. అదనంగా మరో రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టనున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత రెండు దశాబ్దాలుగా ఐటీ, తర్వాత గ్రీన్ ఎనర్జీ పై దృష్టి పెట్టారన్నారు. 2021 సంవత్సరంలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు చాలా వేగవంతంగా ముందుకు వెళుతుందన్నారు. ఈ ప్రాజెక్టులో అటవీ శాఖకి సంబంధించి ఏవో ఉల్లంఘనలు జరిగాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రాజెక్టును చూసేందుకు వచ్చానన్నారు. ఉమ్మడి జిల్లాలో పిన్నాపురం ప్రాజెక్టు మొత్తం 2 వేల 800 ఎకరాలలో ఉందన్నారు. ఇందులో కంపెనీ ప్రభుత్వం నుండి లేదా రైతుల నుండి 1700 ఎకరాల భూమిని కొనిందన్నారు.

కేంద్రం అనుమతితో 365 హెక్టార్ల అటవీ భూమిని కంపెనీ కొనుగోలు చేసిందన్నారు..ఇందు కోసం కాంపెన్సేటరీ యాక్ట్ కింద 365 హెక్టార్ల భూమిని నెల్లూరు లో ఇవ్వడంతో పాటు అటవీ మొక్కల పెంపకానికి అదనంగా 36 కోట్ల రూపాయలను కూడా ఇచ్చారన్నారు.. ఈ ప్రాజెక్టు లో రెవెన్యూ, అటవీ శాఖ మధ్య 45 హెక్టార్ల భూమికి సంబంధించి కొంత వివాదం ఉందని, ఈ సమస్యను పరిష్కరించాలని కేంద్రం దృష్టికి తీసుకొని వెళ్లడం జరిగిందన్నారు..ఇలాంటి సమీకృత ప్రాజెక్టు దేశంలో మరోచోట లేదని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు..
ఈ స్థాయిలో భారీ ప్రాజెక్టును నిర్మించడం చాలా గొప్ప విషయమని తెలిపారు..భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు పర్యాటక కేంద్రంగా మారుతుందన్నారు.. ..

ఈ ప్రాజెక్టు నిర్వహణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో సహకరిస్తాయని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. చిన్న చిన్న సమస్యలుంటే వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతామని తెలిపారు. భారతదేశంలోనే ప్రధానమంత్రి ప్రత్యేకించి వన్ నేషన్ – వన్ ఎనర్జీ కాన్సెప్ట్ ద్వారా మన ఎనర్జీ అవసరాలను మనమే సమకూర్చుకునేలా చేస్తున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చిన ఎనర్జీని విదేశాలకు కూడా విక్రయించి ఫారిన్ ఎక్స్చేంజ్ రెవెన్యూ వచ్చేందుకు అవకాశం ఉందన్నారు. ఈ ప్రాజెక్టు కర్నూలు, నంద్యాల జిల్లాలకే కాక మొత్తం భారతదేశానికి పేరు తెచ్చే ప్రాజెక్టు అని అన్నారు.

అదేవిధంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ క్రింద గ్రామాల్లో ఆర్గానిక్ ఫార్మింగ్, పాలిటెక్నిక్, ఐటీఐ విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఆవుల సంతతి పెంచేలా గోకులాలు ఏర్పాటు చేయాలని, స్థానిక గ్రామాలకు సహకరించాలని, పాఠశాలకు కూడా అవసరమైన సదుపాయాలు కల్పించేలా చూడాలని గ్రీన్ కో యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేశారు. రాళ్లు, రప్పలు ఉన్న స్థలంలో దేశం గర్వించదగ్గ సంస్థను ఏర్పాటు చేసి వేల మందికి ఉపాధి అవకాశాలు ఇవ్వడం జరిగిందని గ్రీన్ కో సంస్థ యాజమాన్యాన్ని అభినందించారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారుగా 43 లక్షల ఇళ్లలో, నెలకు 200 యూనిట్ల వరకు ఇవ్వగలిగే సామర్థ్యం ఉందని, వ్యవసాయానికి సంబంధించి రాష్ట్రంలో 50 శాతం లోడ్ తీర్చగలదని, రాష్ట్రానికి అవసరమైన మూడవ వంతు ఎనర్జీనీ ఈ ప్రాజెక్టు తీర్చే అవకాశం ఉంటుందన్నారు. కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలలో ప్రభుత్వ, అటవీ శాఖ భూములు చాలావరకు అన్యాక్రాంతం అయ్యాయని, వీటికి సంబంధించి అన్ని జిల్లాల్లో త్వరలోనే స్పెషల్ డ్రైవ్ పెట్టేందుకు చర్యలు చేపడతామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సమావేశంలో రాష్ర్ట రోడ్లు భవనాల శాఖా మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, గ్రీన్ కో సంస్థ ఎండీ చలమలశెట్టి అనిల్ కుమార్, కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, జాయింట్ కలెక్టర్ డా. బి. నవ్య, గ్రీన్ కో ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస రావు, సీఈవో కృష్ణ, నంద్యాల, కర్నూలు జిల్లాల డీఎఫ్ఓలు ఉన్నారు.

Latest