Mahaa Daily Exclusive

  పండగ పూట ఆర్టీసీ అడ్డగోలు నిలువు దోపిడి….!

Share

సంక్రాంతి పండగ పూట నగరం పల్లెబాట పట్టింది. దీంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ క్రమంలోనే ప్రయాణికుల సౌరక్యార్థం టీజీఎస్ ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడిపిస్తోంది. స్పెషల్ బస్సుల్లోనూ సాధారణ చార్జీలనే వసూలు చేస్తామని యాజమాన్యం ఊదరగొట్టినప్పటికీ అధికంగా చార్జీలు వసూలు చేస్తుండటంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో టికెట్ ధరపై 50 నుంచి 80 శాతం ఎక్కువగా వసూలు చేస్తుండటాన్ని వ్యతిరేకిస్తూ ఆర్టీసీ సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదానికి దిగుతూ అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సంక్రాంతి స్పెషల్ బస్సుల పేరుతో అడ్డగోలుగా టికెట్ రేట్లను పెంచి ప్రయాణికులను నిలువునా దోచేస్తున్నట్టుగా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి.

ఈ మేరకు సోషల్ మీడియాల్లో బస్సు టికెట్లను ప్రయాణికులు షేర్ చేస్తూ సంక్రాంతి పండగ పూట ఆర్టీసీ బాదుడు అంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో సంక్రాంతికి స్పెషల్ బస్సుల పేరుతో ఆర్టీసీ దోపిడీ చేస్తోందంటూ వనపర్తికి చెందిన ఓ నెటిజన్ పోస్ట్ పెట్టాడు. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచితమే కానీ.. పురుషుల దగ్గర మాత్రం కండక్టర్లు ఎక్స్‌ట్రా ఛార్జీలు వసూలు చేస్తూ జేబులు గుల్ల చేస్తున్నారంటూ వాపోయాడు. వనపర్తి నుంచి మహబూబ్ నగర్‌కు సాధారణంగా ఛార్జీ రూ. 100 ఉంటే ప్రస్తుతం రూ.140 వసూలు చేస్తున్నారని.. అందుకు సాక్ష్యంగా తన టికెట్‌ను ఫొటో తీసి మరీ పోస్ట్ చేశాడు. మహిళల ఛార్జీలు కూడా పురుషుల దగ్గర వసూలు చేస్తున్నారంటూ మండిపడుతూ ట్వీట్ చేశాడు.

మరోవైపు ఈ దారిదోపిడి సాధారణ ప్రయాణికుల దగ్గరే కాదు దివ్యాంగుల దగ్గర కూడా చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ప్రజా పాలనలో పండుగ పేరుతో ఆర్టీసీ టికెట్ రేట్లు అంతకంత పెంచి దోపిడీ చేస్తున్నారని దుయ్యబడుతున్నారు. సాధారణ రోజుల్లో వికలాంగులకు హాఫ్ టికెట్ ఉంటే.. పండుగ పేరుతో వారికి కూడా ఫుల్ టికెట్ తీసుకుంటూ దోపిడీ చేస్తున్నారంటూ తెలంగాణ ఆర్టీసీ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి కడ్తాల్‌కు సాధారణ రోజుల్లో రూ. 70 ఉంటే పండుగ స్పెషల్ బస్సులు అని రూ. 120, అదే కల్వకుర్తికి సాధారణ రోజుల్లో రూ.140 ఉంటే పండుగ స్పెషల్ బస్సులు అని రూ.220 వసూలు చేస్తున్నారంటూ.. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతో మంది సోషల్ మీడియా వేదికగా గోడు వెల్లబోసుకుంటున్నారు. కొన్ని బస్సుల్లో అయితే దాదాపు 50 నుంచి 80 శాతం మేర అధికంగా వసూలు చేస్తుండటం గమనార్హం. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే గతంలోనూ పలు పండగల విషయంలో ఇలాగే ఆర్టీసీలో అడ్డగోలుగా ఛార్జీలు పెంచేస్తున్నారంటూ ప్రయాణికులు గగ్గోలు పెడితే.. తమకు చట్టప్రకారం పెంచే హక్కు ఉందంటూ ఉన్నతాధికారులు ప్రజలకు ఏమాత్రం అర్థకాని లాజిక్‌లు చెప్తూ తప్పించుకునే ప్రయత్నాలు చేశారు. కాగా.. ఇప్పుడు కూడా అదే రిపీట్ చేస్తారనటంలో ఏలాంటి అనుమానమూ లేదు. చట్ట ప్రకారం చేస్తున్నారా, కావాలనే చేస్తున్నారా అనేది ప్రయాణికులకు అనవసరమైన విషయం కానీ వాళ్లపై పండగ సమయంలో భారం పడుతుందా లేదా అన్నదే వాళ్లు ఆలోచిస్తారు. సాధారణ సమయాల్లో అడపాదడపా ప్రయాణాలు చేస్తుంటారు కానీ పండగల సమయంలో కచ్చితంగా ప్రయాణాలు చేస్తారు కాబట్టి అదే అదునుగా తీసుకుని ఇలాంటి సమయాల్లో ఛార్జీలు విపరీతంగా పెంచేయటమనేది వారి ఆగ్రహావేశాలకు కారణమవుతున్నాయి.

ఇదిలా ఉంటే.. ఫ్రీ బస్సు అని పెట్టి పండుగలకు అంతకంత రేట్లు పెంచి రేవంత్ ప్రభుత్వం దోచుకుంటుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తుంటే మరోవైపు బస్సులో సీట్ల కోసం మళ్లీ గొడవలు మొదలయ్యాయి. సంక్రాంతి పండగకు ఆంధ్రప్రదేశ్‌లో కోడి పందేలు ఉంటాయో ఉండవో కానీ తెలంగాణ బస్సుల్లో మాత్రం మహిళల సీట్ల పందేలు ఉంటాయంటూ సెటైర్లు వేసుకుంటున్నారు. అందుకు సంబంధించిన తాజా వీడియోలు షేర్ చేస్తూ నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Latest