తెలంగాణ రాకెట్ తయారీ కేంద్రం కాబోతోంది. దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి టీమ్ పెట్టుబడుల వేటలో దూకుడుగా విజయాలు సాధిస్తోంది. తెలంగాణకు ఇప్పటికే యూనీలీవర్ సంస్థ నుండి పెట్టుబడులు రాగా, మరో కీలక ఒప్పందానికి సీఎం శ్రీకారం చుట్టారు. తెలంగాణలో ఏకంగా ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకై స్కైరూట్ కంపెనీతో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని బృందం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంపై ఇదొక శుభపరిణామమని సీఎం స్పందించారు.
హైదరాబాద్కు చెందిన అంతరిక్ష సాంకేతిక రంగంలోని కంపెనీ స్కైరూట్ ఏరో స్పేస్తో దావోస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో అవగాహన ఒప్పందం ఎంఓయుపై సంతకం చేశారు. ఒప్పందం ప్రకారం తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ మరియు టెస్టింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తుంది. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు స్కైరూట్ కంపెనీ దాదాపు రూ. 500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఒప్పందం పట్ల తన ఆనందం వ్యక్తం చేశారు.
సాంకేతికరంగంలో విజయం గర్వకారణం- సీఎం
. హైదరాబాద్ కు చెందిన సంస్థ అత్యాధునిక సాంకేతిక రంగంలో విజయం సాధించటం గర్వంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణకు చెందిన యువకులు ప్రపంచంలోనే అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించటంతో పాటు, రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వచ్చినందుకు అభినందించారు. స్కైరూట్ కంపెనీతో ప్రభుత్వ భాగస్వామ్యం అంతరిక్ష రంగంపై తమ వ్యూహాత్మక దృష్టిని చాటిచెపుతుందని అన్నారు. త్వరలోనే హైదరాబాద్ ప్రైవేట్ రంగ అంతరిక్ష కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా అభివృద్ధి చేస్తామన్నారు.







