Mahaa Daily Exclusive

  తెలంగాణ నేతలకు బండి సంజయ్ తీవ్ర హెచ్చరిక

Share

  • సాయుధ బలగాలతో సంబంధాలు తెంచుకోండి
  • తెలంగాణ నేతలకు బండి సంజయ్ తీవ్ర హెచ్చరిక
  • లేదంటే కేంద్ర ఏజెన్సీలతో బట్టబయలు చేస్తామని వ్యాఖ్య
  • మావోయిస్టు నేత భూపతి లొంగుబాటు తర్వాత తాజా పరిణామం
  • 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని నిర్మూలిస్తామని కేంద్ర మంత్రి స్పష్టీకరణ

న్యూఢిల్లీ, మహా : తెలంగాణలోని కొందరు రాజకీయ నేతలకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రమైన హెచ్చరిక జారీ చేశారు. మావోయిస్టులతో ఉన్న సంబంధాలను వెంటనే తెంచుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఆదివారం ‘ఎక్స్’ వేదికగా ఆయన ఓ పోస్ట్ చేసిన సంజయ్ “తెలంగాణ రాజకీయ నాయకులు దీనిని ఒక హెచ్చరికగా పరిగణించండి. వేదికలపై ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ, తెరవెనుక సాయుధ గ్రూపులకు అండగా నిలుస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు వెంటనే తమ సంబంధాలను వదులుకోవాలి. లేదంటే వారిని బట్టబయలు చేస్తాం. కేంద్ర దర్యాప్తు సంస్థల చర్యలు కేవలం మావోయిస్టు కేడర్‌తోనే ఆగిపోవు” అని గట్టిగా హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో అవినీతి, నేరాలు, తీవ్రవాద సంబంధాలను కాపాడుతున్న శక్తులను కేంద్రం కనికరం లేకుండా అణిచివేస్తుందని ఆయన తెలిపారు. “సమస్యలో భాగమైన వారు ఎంత పెద్దవారైనా సరే పక్కకు తప్పుకోండి. దేశ అంతర్గత భద్రత విషయంలో తప్పు వైపు నిలబడితే ఎంతటి ఉన్నత నాయకులైనా పతనం కాక తప్పదు” అని స్పష్టం చేశారు.

ఇటీవల మహారాష్ట్రలో లొంగిపోయిన సీనియర్ మావోయిస్టు నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బండి సంజయ్ ఈ హెచ్చరిక చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రూ.6 కోట్ల రివార్డు ఉన్న భూపతి, మరో 60 మంది కేడర్‌తో కలిసి 15 న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారు. తెలంగాణలోని కొందరు రాజకీయ నాయకుల రహస్య అండతో మావోయిస్టు పార్టీలోని ఒక వర్గం పనిచేస్తోందని భూపతి పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం. అంతర్గత కలహాల వల్లే మావోయిస్టు పార్టీ విచ్ఛిన్నమవుతోందని, గిరిజనులు, పేదల కోసం పనిచేయాలన్న ప్రాథమిక సిద్ధాంతం నుంచి పార్టీ పక్కకు జరిగిందని కూడా ఆయన పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. 2024 జనవరి నుంచి ఇప్పటివరకు 2,100 మంది మావోయిస్టులు లొంగిపోయారని, 1,785 మందిని అరెస్టు చేశామని, 477 మందిని మట్టుబెట్టామని ఆయన తెలిపారు. 2026 మార్చి 31 నాటికి దేశం నుంచి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడమే తమ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు

Latest