- గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ చేద్దాం
- భవిష్యత్ ప్రణాళికలను ప్రపంచం ముందుంచేందుకు మంచి అవకాశం
- సదస్సులో వివిధ రంగాలకు చెందిన 1300 మంది పాల్గొంటారు: సీఎస్
- గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష
హైదరాబాద్, మహా: డిసెంబరులో ఫ్యూచర్ సిటీలో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎస్ రామకృష్ణారావు ఆదేశించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఈ సమ్మిట్లో ప్రధాన అంశమని తెలిపారు. రాష్ట్రం సాధించిన అభివృద్ధితో పాటు.. భవిష్యత్ ప్రణాళికలను ప్రపంచం ముందుంచేందుకు ఇది మంచి అవకాశమని సీఎస్ పేర్కొన్నారు. సదస్సులో వివిధ రంగాలకు చెందిన సుమారు 1300 మంది పాల్గొంటారని చెప్పారు. పారిశ్రామికవేత్తలు, ఐటీ నిపుణులు, గ్లోబల్ ఇన్వెస్టర్లు, దౌత్య ప్రతినిధులు, క్రీడా, సినీ ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు వివరించారు. సీఐఐ, ఫిక్కి, నాస్కామ్, అసో చామ్, బ్యాంకింగ్, ఆర్థిక సంస్థల ప్రతినిధులు హాజరవుతారన్నారు. సమ్మిట్లో ఆడియో, వీడియో ప్రజంటేషన్లు, గ్రాఫిక్, యానిమేటెడ్ వీడియో ప్రదర్శనలతో కూడిన 70 స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సమీక్షలో ఉన్నతాధికారులు జయేష్ రంజన్, వికాస్ రాజ్, సవ్యసాచి ఘోష్ తదితరులు పాల్గొన్నారు.








