Mahaa Daily Exclusive

  నేడు కేబినెట్ సమావేశం…. స్థానిక ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకునే చాన్స్

Share

  • నేడు కేబినెట్ సమావేశం
  • స్థానిక ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకునే చాన్స్
  • పార్టీ తరఫున బీసీలకు 42 శాతం సీట్లు కేటాయించాలని యోచన
  • గిగ్ వర్కర్ల సంక్షేమ పాలసీని ఆమోదించనున్న క్యాబినెట్
  • ప్రభుత్వం రెండో వార్షికోత్సవం, రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్ ఆవిష్కరణ

హైదరాబాద్, మహా: నేడు తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. ఇందులో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించనుంది. బీసీ రిజర్వేషన్ల అమలు, హైకోర్టు తీర్పుతో పాటు మిగతా అంశాలపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడో జరగాల్సి ఉంది. కానీ బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం చాలా రోజులుగా కసరత్తు చేస్తోంది. అసెంబ్లీలో తీర్మానం చేయటంతో పాటు ప్రత్యేకంగా జీవోను కూడా జారీ చేసింది. అయితే సర్కార్ తీసుకొచ్చిన జీవోపై కోర్టులు స్టే ఇవ్వటంతో 42 శాతం రిజర్వేషన్లపై సందిగ్ధత నెలకొంది. అప్పట్నుంచి ఎన్నికల నిర్వహణ పెండింగ్ లోనే ఉండిపోయింది.

కేబినెట్ లో చర్చ ఆపై నిర్ణయం!..
రిజర్వేషన్ల పరిమితిపై స్పష్టమైన కోర్టు తీర్పులు ఉండటంతో… బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ప్రభుత్వపరంగా అమలు చేయటం ఇబ్బందికరంగానే మారింది. ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకువస్తోంది. తమ పార్టీపరంగా 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు సిద్ధమనే సంకేతాలు ఇస్తోంది. అయితే ఈ అంశంపై మంత్రివర్గంలో లోతుగా చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. 17వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ ఎన్నికలపై చర్చిస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు.

జూబ్లీహిల్స్ గెలుపుతో మంచి జోష్!
ప్రస్తుతం జూబ్లీహిల్స్ గెలుపుతో మంచి జోష్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక ఆలస్యం చేయకుండా స్థానిక ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తోంది. ఇప్పటికే ఆలస్యమైన నేపథ్యంలో… ఇకపై ఆలస్యం కాకుండా ఎన్నికలు నిర్వహించాలని గట్టిగా భావిస్తోంది. పార్టీ పరంగానే 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామనే ప్రకటన కాంగ్రెస్ నుంచి రావొచ్చన్న వాదనలు, విశ్లేషణలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. దాదాపు ఇదే నిర్ణయాన్ని ప్రకటించి… కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్లే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇలా కాకుండా మరేమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా అనేది నేటి కేబినెట్ భేటీ తర్వాత తెలుస్తుంది.

Latest