Mahaa Daily Exclusive

  రిజర్వేషన్ ఇవ్వకుండా  ఎన్నికలకు వెళ్తే అగ్నిగుండమే:మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

Share

  • రిజర్వేషన్ ఇవ్వకుండా  ఎన్నికలకు వెళ్తే అగ్నిగుండమే
  • బీసీ పోరాటం ఇక్కడ నుండే మొదలవుతుంది
  • మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

ఖమ్మం, మహా: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానిక ఎన్నికలకు వెళ్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతోందని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి ఇప్పటి వరకు ప్రధాన మంత్రిని కానీ.. రాష్ట్రపతిని కానీ, కేంద్రమంత్రిని కానీ ఒక కాంగ్రెస్ ఎంపీ కూడా కలవలేదన్నారు. అలాంటి వేళ.. ఈ బిల్లు ఎలా పాస్ అవుతుందంటూ ఆయన సందేహం వ్యక్తం చేశారు. 42 శాతం రిజర్వేషన్ సాధించడమే రెండు ప్రధాన పార్టీల బాధ్యత అని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు చూసి బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందంటే అది పిచ్చితనమే అవుతుందని స్పష్టం చేశారు. తాము ఉప ఎన్నికల్లో రెండు మినహా అన్ని గెలిచామని గుర్తు చేశారు. ఉప ఎన్నికలలో అధికారంలో ఉన్నవారికే గెలుపు అవకాశాలు అధికమని పేర్కొన్నారు. ఆదివారం ఖమ్మంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వి. శ్రీనివాస్ గౌడ్ విలేకర్లతో మాట్లాడుతూ.. మీరు ఎన్ని అబద్ధాలు ఆడిన భరించామని అధికార కాంగ్రెస్ పార్టీ నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజల నుండి తిరుగు బాటు తప్పదు..
బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని అసెంబ్లీలో కేసీఆర్ ఈ బిల్‌ను ఏకగ్రీవం చేశారని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఈ బీసీ రిజర్వేషన్‌ను పక్కన పెట్టి ఎన్నికలకు వెళ్లాలని చూస్తే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏదో ఒక రోజు ప్రజల నుండి తిరుగు బాటు తప్పదని.. బీసీ పోరాటం ఇక్కడ నుండే మొదలవుతుందని తెలిపారు. మూడేళ్ల క్రితం ఖమ్మంలో ఎక్సైజ్ స్టేషన్, ఈతవనం ప్రారంభించామన్నారు. ప్రస్తుతం ఈతవనం, గౌడ భవనం చూశామని చెప్పారు. స్థానికంగా ఒకరిని అడిగితే రేవంత్ ప్రభుత్వం కొలువు తీరి.. రెండేళ్లు అయ్యిందని.. ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదన్నారన్నారు. ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదని చెప్పారని తెలిపారు. ఏ జిల్లాకు లేని ప్రాధాన్యం ఖమ్మం జిల్లాకు మాత్రమే ఉందన్నారు. ఈ జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారని చెప్పారు. వీరి వద్ద ప్రధాన శాఖలు ఉన్నాయని తెలిపారు. 10 ఏళ్లలో ఆంధ్ర ప్రజలు మన రాష్ట్రంలో ఉంటే బాగుండు అనే విధంగా తెలంగాణ అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత, ఆ ఒక్క ఎన్నికను చూసి గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టాలని కాంగ్రెస్ నాయకులు చూస్తున్నారంటూ మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు.

Latest