- జగిత్యాల జిల్లాలో విషాదం
- బ్రహ్మోత్సవాల్లో విద్యుత్ షాక్
- 11 ఏళ్ల చిన్నారి మృతి
జగిత్యాల, మహా : జగిత్యాల జిల్లాలోని కోడిమ్యాల మండల కేంద్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో విద్యుత్ షాక్ ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. స్థానికంగా ఏర్పడిన ఈ విషాదం గ్రామ ప్రజలను తీవ్రంగా కలచివేసింది. గత మూడు రోజులుగా ఆలయంలో బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం రాత్రి స్వామివారి ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. ఊరేగింపులో భాగంగా నృత్యాలు, కోలాటాలు జరుగుతున్నాయి. అయితే ఊరేగింపు చివర్లో అనుకోకుండా ప్రమాదం సంభవించింది. నృత్యాల్లో పాల్గొంటున్న నాగరాజు – మమత దంపతుల కుమార్తె మధుశ్రీ (11) విద్యుత్ లైన్కు తగిలి అక్కడికక్కడే కుప్పకూలింది. వెంటనే ఆలయ సిబ్బంది మరియు స్థానికులు ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించినా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. చిన్నారి మృతి వార్త విన్న స్థానికులు, భక్తులు విషాదంలో మునిగిపోయారు. ఆలయ కమిటీ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని కొందరు ఆరోపిస్తున్నారు. విద్యుత్ లైన్లను ముందుగానే సురక్షితంగా ఏర్పాటు చేసి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని గ్రామస్థులు అంటున్నారు.








