Mahaa Daily Exclusive

  మెహదీపట్నం స్కైవాక్ సిద్ధం: ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ ఫిబ్రవరిలో ప్రారంభం!

Share

  • మెహిదీపట్నం స్కైవాక్ రెడీ
  • ఆ రూట్‌లో ట్రాఫిక్ సమస్యలకు చెక్
  • ఫిబ్రవరి చివరిలో ప్రారంభం కానున్న స్కైవాక్

హైదరాబాద్, సిటీ, మహా : మెహిదీపట్నం స్కైవాక్ త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. నిత్యం రద్దీగా ఉండే ఈ జంక్షన్‌లో పాదచారుల భద్రత కోసం నిర్మిస్తున్న ఈ స్కైవాక్ నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చిందని.. చిన్న చిన్న పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ స్కైవాక్ ఆధునిక సౌకర్యాలతో పాటు వాణిజ్య అవసరాలకు కూడా ఉపయోగపడనుంది. ఫిబ్రవరి చివరిలో లేదా మార్చిలో ప్రారంభమయ్యే ఈ ప్రాజెక్ట్, నగరవాసులకు కొత్త అనుభూతిని అందించనుంది. ఈ స్కైవాక్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు హెచ్‌ఎండీఏ అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం స్కైవాక్ వద్ద చివరి దశ పనులు, అంటే కేబుల్స్ బిగించడం, ఫినిషింగ్ పనులు జరుగుతున్నాయి. దాదాపు రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న ఈ ప్రాజెక్ట్ కోసం రూ. 32.47 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు వెల్లడించారు. దీని నిర్మాణం పూర్తయ్యే దశకు చేరుకుంది. ప్రధాన పనులన్నీ పూర్తయ్యాయని, చిన్నచిన్న పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి.

మెహదీపట్నం జంక్షన్ హైదరాబాద్‌లో అత్యంత రద్దీగా ఉండే ట్రాఫిక్ మార్గాలలో ఒకటి. ప్రతిరోజూ లక్షలాది వాహనాలు ఈ జంక్షన్ గుండా వెళ్తాయి. ఇక్కడ రోజుకు సుమారు 1,600 ఆర్టీసీ బస్సులు తిరుగుతాయి. వీటికి తోడుగా శివార్లలోని పలు ఇంజనీరింగ్, కళాశాలలకు సంబంధించిన బస్సులు కూడా రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ జంక్షన్ మొయినాబాద్, నార్సింగి, పరిగి, షంషాబాద్, తాండూర్, వికారాబాద్ వంటి ప్రాంతాలను కలుపుతుంది. అలాగే, నగరంలోని ఎల్‌బీ నగర్, ఉప్పల్, చార్లపల్లి, దిల్‌సుఖ్‌నగర్, హయత్‌నగర్ వంటి ప్రాంతాలను కూడా కలుపుతుంది. ఈ ప్రాంతం హైటెక్ సిటీ, రాయదుర్గం, మణికొండ, నార్సింగి, కొకపేట్, నానక్‌రామ్‌గూడ వంటి ప్రధాన ఐటీ, ఆర్థిక జిల్లాలకు కీలకమైన ప్రవేశ ద్వారంగా కూడా పనిచేస్తుంది. దీంతో ఈ జంక్షన్‌లో విపరీతమైన రద్దీ ఉంటుంది. దీనికి తోడు పాదచారులు ఎక్కువగా తిరుగుతుండటంతో ఈ మార్గంలో ట్రాఫిక్ జామ్, పెద్ద సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రజల భద్రత దృష్ట్యా స్కైవాక్ నిర్మించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

ఈ స్కైవాక్ నిర్మాణం 340 మీటర్ల పొడవు ఉంటుంది. ఇది మెహదీపట్నం బస్ స్టాప్ నుండి జంక్షన్ ఎదురుగా ఉన్న డిఫెన్స్ ల్యాండ్ వరకు విస్తరించి ఉంటుంది. ఇందులో 160 మీటర్లు ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ వైపు, 180 మీటర్లు మల్లేపల్లి వైపు ఉంటాయి. అధికారులు ఈ స్కైవాక్‌ను ఆర్చ్-స్టైల్ ఎలివేషన్‌తో, ఆధునిక సౌకర్యాలతో రూపొందించారు. ఉప్పల్ స్కైవాక్ నుంచి ప్రేరణ పొంది దీన్ని నిర్మించారు. ఉప్పల్ స్కైవాక్ ట్రాఫిక్ జామ్‌లను తగ్గించడంలో సహాయపడటమే కాకుండా, ప్రజలు సేదతీరేందుకు అనుకూల ప్రదేశంగా మారింది. ఇప్పుడు మెహదీపట్నం స్కైవాక్‌ను కూడా అలానే నిర్మిస్తున్నారు. ఈ స్కైవాక్‌లో లోపలికి, బయటకు వెళ్లడానికి 5 ద్వారాలు ఉన్నాయి. నడవడానికి వీలుగా ఉండే మార్గాలు 4-5 మీటర్ల వెడల్పుతో ఉన్నాయి. ఇది పాదచారులు సౌకర్యవంతంగా నడవడానికి వీలు కల్పిస్తుంది. స్కైవాక్‌లో 12 లిఫ్టులు కూడా ఏర్పాటు చేశారు. ప్రతి లిఫ్ట్ ఒకేసారి 20 మంది వరకు తీసుకెళ్లగలదు. ఇది వృద్ధులకు, దివ్యాంగులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.

పాదచారులు సురక్షితంగా రోడ్డు దాటడానికి ఉపయోగపడటంతో పాటు, ఈ స్కైవాక్‌ను బహుళ ప్రయోజనకరమైన ప్రదేశంగా కూడా తీర్చిదిద్దారు. ఇక్కడ 21,061.42 చదరపు అడుగుల స్థలాన్ని అధికారులు వాణిజ్య అవసరాల కోసం కేటాయించారు. ఇందులో కాఫీ షాపులు, స్నాక్ స్టాల్స్, ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయవచ్చు. స్కైవాక్ అంతటా కూర్చునేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దీనితో, కుటుంబాలు, యువత రద్దీగా ఉండే ట్రాఫిక్‌కు దూరంగా, పైన సురక్షితంగా విశ్రాంతి తీసుకునేందుకు ఇది ఒక మంచి ప్రదేశంగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు.

Latest