- రాజ్యాధికార పార్టీకి కత్తెర గుర్తు కేటాయింపు
- తీన్మార్ మల్లన్న స్థాపించిన రాజ్యాధికార పార్టీ
- గుర్తు ప్రకటింపును అధికారికంగా ప్రకటించిన ఎస్ఈసీ
హైదరాబాద్, మహా : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్థాపించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీకి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ‘కత్తెర’ గుర్తును అధికారికంగా కేటాయించింది. సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కోసం పోరాటం తన పార్టీ ప్రధాన లక్ష్యాలుగా తీన్మార్ మల్లన్న ప్రకటించారు. త్వరలోనే రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం పలు రాజకీయ పార్టీలకు గుర్తులను కేటాయిస్తూ నోటిఫికేషన్ను జారీ చేసింది. తెలంగాణ మున్సిపాలిటీల చట్టప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘం పలు పార్టీలకు ఈ గుర్తులను కేటాయిస్తూ ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద నమోదు అయి, గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు, రాష్ట్రంలో గుర్తింపు పొందిన పార్టీలు, ఇతర రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలతో పాటుగా ప్రత్యేక రిజర్వ్ గుర్తులు కలిగిన రాజకీయ పార్టీలు, గుర్తులు లేని పార్టీలు, అలాగే ఫ్రీ సింబల్స్ జాబితాను వెల్లడించింది. అందులో భాగంగా తీన్మార్ మల్లన్న స్థాపించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సైతం ఈసీ గుర్తు కేటాయించింది.
ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపకులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ గుర్తు సామాన్య ప్రజలకు ఒక ఆయుధం లాంటిదని, అణగారిన వర్గాల రాజకీయ హక్కుల కోసం పోరాడటానికి దీన్ని ఉపయోగిస్తామని ఆయన తెలిపారు. టీఆర్పీ కార్యకలాపాలు మూడు ముఖ్య సూత్రాలపై ఆధారపడి ఉంటాయని తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. అవి ఆత్మగౌరవం, అధికారం, సరైన ప్రాతినిధ్యం. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీ వర్గాలకు రాజకీయాల్లో సమాన అవకాశాలు కల్పించడం, క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించడం, పారదర్శక పాలన కోసం కృషి చేయడం పార్టీ లక్ష్యాలని తెలిపారు. గుర్తు కేటాయింపు పార్టీలో సంబరాలకు దారితీసింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు మిఠాయిలు పంచుతూ సంబరాలు చేసుకున్నారు. ముఖ్యంగా యువత, బీసీ సంఘాల నుంచి ఈ వార్తకు మంచి స్పందన లభించింది. ఇది పార్టీకి పెరుగుతున్న మద్దతును సూచిస్తుందని వారు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ‘కత్తెర’ గుర్తు ప్రతి గ్రామానికి చేరుతుందని, తద్వారా టీఆర్పీ బలం పెరుగుతుందని పార్టీ నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణలో సామాన్య ప్రజల గొంతుకగా మారిన ఈ పార్టీకి ఇది ఒక చారిత్రాత్మక మలుపు అని, వారి రాజకీయ ప్రయాణంలో ఇది ఒక కొత్త అధ్యాయాన్ని సూచిస్తుందని వారు తెలిపారు.








