- సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ
- ఇంకెంత కాలం ప్రశ్నిస్తారన్న సర్వోన్నత న్యాయస్థానం
- మార్చి 10 కి విచారణ వాయిదా
న్యూఢిల్లీ, మహా : సంచలనవ సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభాకర్రావు ఇంటరాగేషన్ ఇంకెంతకాలం కొనసాగిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇప్పటికే ఆయన్ను రెండు వారాలకు కస్టడీకి అనుమతించామని, ఇంకా అదనపు విచారణ అవసరంలేదని వ్యాఖ్యానించింది. ప్రభాకర్రావు ముందస్తు బెయిల్ పిటిషన్పై శుక్రవారం సుప్రీంలో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభాకర్రావుకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని ప్రభుత్వం తరఫున లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదించారు. దీంతో ముందస్తు బెయిల్ ఇచ్చినంత మాత్రాన ఆయన్ని పిలవకుండా ఉండలేరు కదా..? మీ పర్పస్ పూర్తయిందా లేదా? ప్రభాకర్రావును మళ్లీ జైల్లో పెట్టాలనుకుంటున్నారా..? అని జస్టిస్ నాగరత్న ప్రశ్నించారు. అయితే ఈ కేసు దర్యాప్తులో న్యాయపరమైన అంశాలు ముడిపడి ఉన్నాయని, ప్రభుత్వ వాదనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం తదుపరి విచారణను మార్చి 10వ తేదీకి వాయిదా వేసింది. ప్రస్తుతం నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.








