- ప్రేమ పెళ్కికి నిరాకరించారి
- మత్తు ఇంజక్షన్తో తల్లిదండ్రులను చంపేసిన కూతురు
- వికారాబాద్ జిల్లాలో దారుణం
వికారాబాద్, మహా : వికారాబాద్ జిల్లాలో అత్యంత పాశవికమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ వివాహానికి అడ్డుపడుతున్నారన్న నెపంతో నవమాసాలు మోసిన తల్లిని.. ఏ కష్టం రాకుండా అడిగిందల్లా ఇచ్చి ఓ స్థాయికి తీసుకొచ్చిన తండ్రిని కన్నకూతురే అత్యంత కిరాతకంగా హతమార్చింది. మత్తు ఇంజక్షన్ ఇచ్చి.. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారని అందరినీ నమ్మించాలని చూసింది. పోలీసుల దర్యాప్తులో అసలు నిజం బయటపడగా.. కటకటాల వెనక్కి వెళ్లింది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. బంట్వారం మండల పరిధిలోని యాచారం గ్రామానికి చెందిన నక్కలి దశరథం (58), నక్కలి లక్ష్మి (54) దంపతులు రెండ్రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వీరి మరణం తొలుత అప్పుల బాధతో చేసుకున్న ఆత్మహత్యగా ప్రచారమైంది. మృతుల కుమారుడు అశోక్ కూడా తన తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులతో తనువు చాలించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి.
మృతుల కుమార్తె సురేఖ వృత్తిరీత్యా నర్సుగా పనిచేస్తోంది. ఆమెకు ఏడాది క్రితం ఇన్స్టా వేదికగా ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే ఆమె ప్రేమ వ్యవహారం తల్లిదండ్రులకు ఇష్టం లేదు. ప్రేమ పెళ్లికి ఒప్పుకునేది లేదని తెగేసే చెప్పారు. ఆ మాటతో సురేఖ కోపం పెంచుకుంది. తమ ప్రేమకు అడ్డుగా ఉన్నారన్న కక్షతో తన వృత్తిని ఆయుధంగా మార్చుకుంది. తల్లిదండ్రులను అడ్డుతొలగించుకోవాలని స్కెచ్ వేసింది. కెటామైన్ వంటి అత్యంత శక్తివంతమైన మత్తు మందును ఇంజక్షన్ రూపంలో తల్లిదండ్రులకు ఇచ్చింది. కీళ్ల నొప్పులకు ఇంజక్షన్ ఇస్తున్నానని చెప్పి.. హై డోస్ మత్తుమందు శరీరంలోకి ఎక్కించటంతో వారు స్పృహ కోల్పోయి మరణించారు. హత్య చేసిన తర్వాత ఏమీ తెలియనట్లు సురేఖ తన అన్న అశోక్కు ఫోన్ చేసింది. ‘అమ్మా నాన్నలు స్పృహ తప్పి పడిపోయారు.. పలకడం లేదు’ అని ఏడుస్తూ నాటకమాడింది. దీంతో అంతా అది ఆత్మహత్యేనని భ్రమపడ్డారు. కానీ, వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు లోతుగా విచారించగా.. సురేఖ పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తమదైన శైలిలో విచారించగా.. తానే మత్తు ఇంజక్షన్ ఇచ్చి చంపినట్లు ఆమె అంగీకరించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కన్నవారిని కాటికి పంపిన ఈ కిరాతక కూతురిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రేమ మత్తులో పెంచిన ప్రేమను మర్చిపోయిన సురేఖను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.







