Mahaa Daily Exclusive

  ఉద్యోగుల ఉసురు పోసుకోకండి: పెండింగ్ డీఏలు, పీఆర్సీ బకాయిలపై సీఎం రేవంత్‌కు బండి సంజయ్ ఘాటు లేఖ!

Share

  • ప్రభుత్వ ఉద్యోగుల డీఏలు, పీఆర్సీ బకాయిలు చెల్లించాలంటూ
  • సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ
  • లేకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరిక

హైదరాబాద్, మహా : మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు ముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై బీజేపీ నేత, కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, రిటైర్డ్ ఉద్యోగుల డీఏలు, పీఆర్సీ బకాయిలు, రిటైర్మెంట్ ప్రయోజనాలపై.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బండి సంజయ్ మంగళవారం బహిరంగ లేఖ రాశారు. ఉద్యోగుల పెండింగ్ డీఏలు, పీఆర్సీలతోపాటు.. రిటైర్మెంట్ ప్రయోజనాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో 3 లక్షలకుపైగా రెగ్యులర్ ఉద్యోగులతోపాటు 4 లక్షలకు పైగా రిటైర్డ్ ఉద్యోగులకు మొత్తంగా ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని బండి సంజయ్ పేర్కొన్నారు. వీటితోపాటు పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల గ్రాట్యుటీ, ఈపీఎఫ్, లీవ్ ఎన్‍క్యాష్‍మెంట్ కూడా రాష్ట్ర సర్కార్ చెల్లించడం లేదని మండిపడ్డారు. 2023 జులై నుంచి అమలు చేయాల్సిన పీఆర్సీని రెండున్నర సంవత్సరాలు అవుతున్నా వాటి గురించి కనీసం మాట్లాడకపోవడం దారుణమని పేర్కొన్నారు. కనీసం పీఆర్సీ నివేదికను కూడా తెప్పించుకోకపోవడం చూస్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఎంతటి నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నారనే అర్థం చేసుకోవచ్చని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులను తీవ్ర మానసిక వేదనకు గురిచేస్తోందని, ఇది క్షమించరానిదని బండి సంజయ్ పేర్కొన్నారు. జీవితాంతం ప్రభుత్వం కోసం పనిచేసిన ఉద్యోగులు పదవీ విరమణ చేస్తే వారికి వచ్చే ప్రయోజనాలు అన్నింటినీ చెల్లించి సగౌరవంగా వారిని సన్మానించి ఇంటికి పంపించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శలు గుప్పించారు.

మానవత్వం ఉన్న పాలకులెవరూ ఇంతటి నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించరని, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రిటైర్మెంట్ బెన్‍ఫిట్స్ అందక గత సంవత్సర కాలం నుంచి ఇప్పటివరకు 61 మంది రిటైర్డ్ ఉద్యోగులు మానసిక వేదనకు గురై చనిపోయినట్లు బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులతోపాటు.. ఉద్యోగ, ఉపాధ్యాయలకు చెల్లించాల్సిన బకాయిలను అన్నింటినీ కలిపితే రూ.12 వేల కోట్లకుపైగా ఉంటాయని పేర్కొన్నారు. ప్రతీ సంవత్సరం రూ.2.5 కోట్లకు పైగా బడ్జెట్ కలిగిన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు రూ.12 వేల కోట్ల బకాయిలు చెల్లించడాన్ని భారంగా భావించడం అంటే దాని కన్నా దురదృష్టం ఇంకోటి లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్య ధోరణిని వదిలేసి.. ఉద్యోగుల బెన్‍ఫిట్స్ బకాయిలను యుద్ధ ప్రాతిపదికన చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకపోతే మున్సిపల్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, రిటైర్డ్ ఉద్యోగుల తరఫున బీజేపీ భారీ ఎత్తున నిరసన, ఆందోళన కార్యక్రమాలను చేపట్టేందుకు వెనుకాడబోమని తీవ్ర హెచ్చరికలు చేశారు. అవసరమైతే హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉద్యోగుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చే వరకు దీక్ష చేసేందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించేందుకు కూడా వెనుకాడమని తేల్చి చెప్పారు.

Latest