Mahaa Daily Exclusive

  సైనికుల త్యాగాలను ఎప్పటికి స్మరించుకోవాలి.. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి..!

Share

ఖమ్మం, మహా.
సైనికుల త్యాగాలను ఎప్పటికి స్మరించుకోవాలని, వారి సేవలను మనసులో ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. శనివారం స్థానిక ఫ్రీడం పార్క్ లో చేపట్టిన కార్గిల్ విజయ్ దివస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో కలెక్టర్ పాల్గొని అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ,
జూలై 26న భారత దేశ అఖండ విజయాన్ని మననం చేసుకుంటూ కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటున్నామన్నారు. మనం ప్రశాంతంగా ఉండి, అభివృద్ధి పథంలో వెళుతున్నామంటే, సరిహద్దులో మన హద్దుల్ని కాపాడే సైనికుల వల్లే నని ఆయన తెలిపారు. కుటుంబాలకు దూరంగా, మనకోసం హద్దుల్లో చలికి, ఎండకి లెక్కచేయక కాపలాకాస్తున్న సైనికుల త్యాగాలు వెలకట్టలేనివన్నారు. భారత దేశ సరిహద్దులో 25 సంవత్సరాల క్రితం మన సైన్యం అధికారులు, జవాన్లు ప్రాణాలకు తెగించి పోరాడి, ప్రాణాలు సైతం పోగొట్టుకొని దేశానికి కార్గిల్ యుద్ధ విహాయాన్ని అందించారని అన్నారు. సైనికులు నిబద్ధత, క్రమశిక్షణ కు మారుపేరని, మనం రోజువారీ చర్యల్లో క్రమశిక్షణ అలవర్చుకోవాలని తెలిపారు. సైనికుల స్ఫూర్తి యువతలో నిండి వుండాలన్నారు. మాజీ సైనికులు, సైనికుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని కలెక్టర్ అన్నారు.

ఈ సందర్భంగా అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానించారు. ఫ్రీడమ్ పార్క్ లో కలెక్టర్ మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పగడాల శ్రీవిద్య, ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి ఎం. చంద్రశేఖర్, ఇంటలిజెన్స్ అడిషనల్ డిసిపి రామోజీ రమేష్, వింగ్ కమాండర్ సురేంద్ర, జిల్లా మాజీ సైనికుల అసోసియేషన్ బాధ్యులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.