- నాది ఫైటింగ్ నేచర్..
- హూజూరాబాద్లో నేనే లీడర్..
- ఎవరైనా ఇబ్బంది పెడితే నేనే ఫారమ్లు ఇస్తా
- నిఖార్సైన ఉద్యమ బిడ్డ.. ఎక్కడ అన్యాయమున్నా కొట్లాడుతా
- బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు
హుజూరాబాద్, మహా: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి తానే లీడర్నని ప్రకటించుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన బీ ఫారమ్లను తానే ఇస్తానని ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈటల రాజేందర్ అనుచరులకు కాకుండా ఇతరులకు పోటీ చేసే చాన్స్ వస్తోందని ప్రచారం జరుగుతున్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్లో 25 సంవత్సరాలుగా తాను లీడర్గా ఉన్నానని, బీజేపీ పార్టీకి సంబంధించిన బీ ఫారమ్లు తానే కేటాయిస్తానని ఈటల స్పష్టం చేశారు. “ఇక్కడి రాజకీయాల్లో నా పట్ల ప్రజలు, కార్యకర్తలు పూర్తి విశ్వాసం ఉంది. ఎవరైనా ఇబ్బంది పెడితే, నేనే ఫారమ్లు ఇస్తా” అని ప్రకటించారు.హుజురాబాద్ పట్టణంలో శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఈటల్ రాజేందర్, స్థానిక ఎన్నికలు ఆలస్యమవుతున్నాయని.. బీసీలకు న్యాయం జరగాలని, కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే క్షమాపణ చెప్పి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. “కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ విషయంలో గందరగోళం సృష్టించింది. ముఖ్యమంత్రి ప్రజలను వంచించి, మోసం చేశారు” అని మండిపడ్డారు. బీజేపీ మొదటి నుంచి బీసీ రిజర్వేషన్లకు మద్దతు ఇచ్చినప్పటికీ, కాంగ్రెస్ పార్టీకి “నిజాయితీ, చిత్తశుద్ధి లేవు” అని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను “అబద్ధాల పునాది, గోల్మాల్”గా అభివర్ణించిన ఈటల, హైదరాబాద్లో పేదల గుడిసెలు కూల్చివేసి, ప్రజల బతుకులు నాశనం చేసిందని ఆరోపించారు. “ప్రజలు కాంగ్రెస్ను ‘థు’ అని అంటున్నారు. గతంలో కేసీఆర్ వేధిస్తున్నాడని చతికిల పడిన పార్టీని గెలిపించి, ఇప్పుడు ప్రజలు, ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారు” అని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించి, “ఆరు గ్యారంటీలు, హామీల గురించి మాట్లాడట్లేదు. గతంలో ఉన్నవే ఇవ్వమని ప్రజలు అడుగుతున్నారని గుర్తు చేశారు. ఈటల రాజేందర్ అంటే నిఖార్సైన ఉద్యమ బిడ్డ. ఎక్కడ అన్యాయమున్నా కొట్లాడే బిడ్డ. ఇది నేను బోందలోకి పోయినప్పుడే పోతది” అని ఎమోషనల్ గా ప్రకటించారు. తెలంగాణ చరిత్రలో తన పోరాటానికి 5 పేజీలు కేటాయించాలని, ఎక్కడ ఎవరు సమ్మెలు చేసినా ధర్మ యుద్ధం చేసినవాడిని అని ప్రకటించారు. “మీకు ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇస్తున్నాము. ఎవరికీ భయపడే వాళ్ళం కాదు. ఎప్పటికైనా ప్రజలకు తోడుగా అండగా ఉండేవాళ్ళం మేము” అని అనుచరులకు భరోసా ఇచ్చారు.





