చింతకాని, మహా : ఖమ్మం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సీపీఎం నేత, రైతు సంఘం రాష్ట్ర మాజీ కార్యదర్శి సామినేని రామారావును దుండగులు హతమార్చారు. చింతకాని మండలం పాతర్లపాడులో ఈ ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం వాకింగ్కు వెళ్లిన ఆయన్ను కత్తులతో పొడిచి చంపేశారు. రామారావు రెండుసార్లు రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శిగా, పాతర్లపాడు సర్పంచ్గా పనిచేశారు. ఖమ్మం సీపీ సునీల్ దత్ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పోతినేని సుదర్శన్, పొన్నం వెంకటేశ్వరరావుతో పాటు పలువురు నేతలు రామారావు కుటుంబాన్ని పరామర్శించారు. మరోవైపు పాతర్లపాడులో పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలో హింసా రాజకీయాలకు తావు లేదు: భట్టి విక్రమార్క
సామినేని రామారావు హత్యపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్రంలో హింసా రాజకీయాలకు తావులేదని.. దోషులను వెంటాడి, వేటాడి చట్టపరంగా శిక్షిస్తామని చెప్పారు.






