Mahaa Daily Exclusive

  ఫీజు బకాయిల సమరం.. నేటి నుంచి కాలేజీల నిరవధిక బంద్‌..

Share

  • ఫీజు బకాయిల సమరం..
  • నేటి నుంచి కాలేజీల నిరవధిక బంద్‌
  • ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై ప్రైవేట్‌ కాలేజీల యాజమాన్యాల పోరుబాట
  • 6న 2 లక్షల మంది అధ్యాపకులతో సభ.. 10న చలో హైదరాబాద్‌

హైదరాబాద్, మహా: ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదల ఆలస్యంపై తెలంగాణలోని ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ప్రభుత్వానికి గట్టి అల్టిమేటం జారీ చేసింది. తమకు రావాల్సిన బకాయిల విషయంలో ప్రభుత్వం తక్షణమే ఒక స్పష్టమైన నిర్ణయం ప్రకటించకపోతే నేటి ుండి రాష్ట్రవ్యాప్తంగా కళాశాలలు నిరవధిక బంద్‌కు దిగుతాయని సమాఖ్య హెచ్చరించింది. విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపగల ఈ నిర్ణయంతో, ఇప్పుడు అందరి దృష్టి ప్రభుత్వం నేటి స్పందనపైనే నిలిచింది.

తప్పనిసరి పరిస్థితుల్లోనే బంద్ నిర్ణయం..
ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దసరా పండుగకు ముందే ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.1,200 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, కేవలం రూ.300 కోట్లు మాత్రమే విడుదల చేసిందని సమాఖ్య ఆరోపించింది. దీంతో, తమకు రావాల్సిన బకాయిలు పేరుకుపోవడంతో కళాశాలల నిర్వహణ భారంగా మారిందని, తప్పనిసరి పరిస్థితుల్లోనే బంద్ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని యాజమాన్యాలు పేర్కొన్నాయి.
ఈ నిరసన కేవలం కళాశాలల మూసివేతతో ఆగదని సమాఖ్య స్పష్టం చేసింది. ఫీజు బకాయిలు పూర్తిగా చెల్లించే వరకు తాము కళాశాలలను తిరిగి తెరవబోమని తేల్చి చెప్పింది.

6న 2 లక్షల మంది అధ్యాపకులతో సభ..
ఈ నెల 6న హైదరాబాద్‌లో దాదాపు లక్షన్నర మంది కళాశాల సిబ్బంది, లెక్చరర్లతో భారీ సభ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ బంద్‌తో వేలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయుల భవిష్యత్తు అనిశ్చితిలోకి నెట్టబడుతోంది. ఉన్నత విద్యాసంస్థల హెచ్చరిక నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది. పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను విడుదల చేసేందుకు ప్రభుత్వం ఒక రోడ్‌మ్యాప్‌ను ప్రకటిస్తుందా లేక యాజమాన్యాల ఆందోళనను నిరోధించేందుకు వేరే చర్యలు తీసుకుంటుందా అనేది చూడాలి. ఏదేమైనా, ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్య ఇప్పుడు విద్యారంగంలో ఒక తీవ్ర సంక్షోభానికి దారితీసే అవకాశం కనిపిస్తోంది