- ఆఫ్రికా పర్యటనకు వెళుతున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- రాష్ట్రపతితో కలిసి ఆఫ్రికా పర్యటనకు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ
- అంతర్జాతీయ వేదికపై తెలంగాణ మహిళా నాయకత్వానికి గుర్తింపు
హైదరాబాద్, మహా : రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి ఆఫ్రికాలో జరిపే అధికారిక పర్యటనలో మహబూబ్నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ పాల్గొననున్నారు. భారత ప్రతినిధి బృందంలో సభ్యురాలిగా ఆమె ఈ పర్యటనకు ఎంపికయ్యారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తెలంగాణకు ప్రాతినిధ్యం వహించే ఈ కీలక పర్యటన ద్వారా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా వాణిజ్యం, వ్యవసాయం, సాంకేతికత, సాంస్కృతిక మార్పిడి వంటి కీలక రంగాల్లో భారత్, ఆఫ్రికా దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడంపై ప్రధానంగా చర్చలు జరపనున్నారు. తెలంగాణ మహిళా నాయకత్వాన్ని ప్రపంచ వేదికపై నిలబెట్టేందుకు ఇదొక గొప్ప అవకాశంగా డీకే అరుణ భావిస్తున్నారు. గ్రామీణాభివృద్ధి, మహిళల పురోగతి, రైతుల సంక్షేమం కోసం ఆమె చేసిన సేవలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిన నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.
ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ, “ప్రపంచ ప్రగతిలో తెలంగాణ పాత్రను మరింత బలంగా నిలబెట్టడమే నా లక్ష్యం. ఈ పర్యటన ద్వారా మహిళలు, రైతులు, యువతకు ఉపయోగపడే అవకాశాలను మన రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు పూర్తిస్థాయిలో కృషి చేస్తాను” అని తెలిపారు. ఈ పర్యటనతో భారత్-ఆఫ్రికా సంబంధాలు కొత్త దిశగా పయనిస్తాయని, అదే సమయంలో తెలంగాణ ప్రతిష్ఠ అంతర్జాతీయంగా ఇనుమడిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు






