Mahaa Daily Exclusive

  1.77 కి.మీ పొడవుతో కృష్ణానదిపై ఐకానిక్ కేబుల్ వంతెన….

Share

  • 1.77 కి.మీ పొడవుతో కృష్ణానదిపై ఐకానిక్ కేబుల్ వంతెన
  • సోమశిల, సిద్ధేశ్వరం మధ్య నిర్మాణం
  • అంచనా వ్యయం రూ.1083 కోట్లు

హైదరాబాద్, మహా : తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలను కలుపుతూ కృష్ణానదిపై ఐకానిక్‌ కేబుల్‌ వంతెన అందుబాటులోకి రానుంది. ఈ బ్రిడ్జి నిర్మాణానికి వేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న సోమశిల వద్ద నిర్మించనున్న ఈ భారీ ప్రాజెక్టు కోసం భూ సేకరణ, టెండర్ల ప్రక్రియ దాదాపు పూర్తి కావడంతో త్వరలోనే పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. జాతీయ రహదారుల సంస్థ (ఎన్ హెచ్ఏఐ) అధికారులు ఈ ప్రాజెక్టును మూడో ప్యాకేజీలో చేపట్టనున్నారు. మొత్తం 1.77 కిలోమీటర్ల పొడవున ఈ కేబుల్ వంతెనను నిర్మించనున్నారు. నిర్మాణ వ్యయం సుమారు రూ. 1083 కోట్లుగా అంచనా వేశారు. శ్రీశైలం జలవిద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణం కారణంగా ఉభయ తెలుగు రాష్ట్రాల పరిధిలో సుమారు 117 గ్రామాలు, లక్షలాది ఎకరాల భూమి ముంపునకు గురైంది. అప్పటి నుంచి ఈ రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా నాగర్‌కర్నూల్‌ జిల్లా పరిధిలోని కొల్లాపూర్‌ (సోమశిల) తీరానికి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నందికొట్కూర్‌ పరిధిలోని సిద్ధేశ్వరం గుట్టల మధ్య ప్రయాణించడానికి ప్రజలు పడవలు, పుట్టీలపై ప్రమాదకరంగా నదిని దాటాల్సి వస్తోంది. ఈ ప్రమాదకర ప్రయాణంలో చాలామంది ప్రాణాలు కోల్పోవడం తీర గ్రామాల ప్రజలకు శాపంగా మారింది. ఈ కేబుల్ వంతెన నిర్మాణంతో ఈ శాశ్వత రాకపోకల సమస్య పూర్తిగా తీరిపోతుంది.

టెండర్ల ప్రక్రియ కొనసాగుతున్నందున అధికారులు వచ్చే ఏడాది జనవరిలో నిర్మాణ పనులను అధికారికంగా చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ వంతెన నిర్మాణంలో భాగంగా సోమశిల, సిద్ధేశ్వరం గుట్టల వైపు అడుగుభాగంలో 70 మీటర్ల ఎత్తులో, నదీ ప్రవాహం పైన సుమారు 100 మీటర్ల ఎత్తులో పిల్లర్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఇది కేవలం రవాణాకే కాకుండా, ఒక పర్యాటక ఆకర్షణీయ కేంద్రంగా కూడా అభివృద్ధి చెందుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వంతెనతో పాటుగా, రెండు వైపులా అప్రోచ్ రహదారుల నిర్మాణం కూడా కీలకమైనది. ఈ అప్రోచ్ రహదారి మొత్తం పొడవు 13 కిలోమీటర్లుగా నిర్ణయించగా దీని కోసం రూ. 460 కోట్లు నిధులు కేటాయించారు. కొల్లాపూర్‌ మండలం వరిదేల రెవెన్యూ శివారు నుంచి సోమశిల గుట్ట వరకు సుమారు 8 కిలోమీటర్ల మేర అప్రోచ్ రోడ్డు నిర్మించడానికి సోమశిల, చెన్నంపల్లి, పెంట్లవెల్లి, మల్లేశ్వరం శివార్ల పరిధిలో మొత్తం 25 హెక్టార్ల అటవీభూమి, 28 హెక్టార్ల రెవెన్యూ మరియు పట్టా భూములను సేకరించారు. సిద్ధేశ్వరం గుట్ట నుంచి కపిలేశ్వరం, నందికొట్కూరు అటవీ ప్రాంతంలో సుమారు 5 కిలోమీటర్ల మేర అప్రోచ్ రహదారి కోసం 25 హెక్టార్ల మేర భూసేకరణ పూర్తయింది. ఈ వంతెన పూర్తి అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య దూరం తగ్గడంతో పాటు ఆర్థిక భారం తగ్గి, శాశ్వతంగా రాకపోకల సమస్య తీరుతుందని తీర గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది రెండు రాష్ట్రాల మధ్య వాణిజ్యం, పర్యాటక రంగాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు చెబుతున్నారు.

Latest