Mahaa Daily Exclusive

  కేంద్రం రాష్ట్రాలను సమానంగా చూడటం లేదు:ఐఎఎస్ జయేశ్ రంజన్

Share

  • కేంద్రం రాష్ట్రాలను సమానంగా చూడటం లేదు:ఐఎఎస్ జయేశ్ రంజన్
  • పెట్టుబడులు ఆకర్షించాలంటే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలిచ్చి వాటికోసం సదస్సులు పెట్టాలి

హైదరాబాద్, మహా : కేంద్ర ప్రభుత్వం తన చేతిలో ఉన్న విదేశీ పెట్టుబడులకు ప్రోత్సాహకాలు యిచ్చే అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని తద్వారా రాష్ట్రాల మధ్యన ఆరోగ్యకరమైన పోటీ లేదని తెలంగాణ సిఎం కార్యాలయంలోని ఇండస్ట్రీ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ సెల్ మరియు స్పీడ్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ (స్పీడ్) లకు సీఈఓగా బాధ్యతలు చూస్తున్న ఐఎఎస్ అధఇకారి జయేష్ రంజన్ అన్నారు. అలాగే రక్షణ, ఏరోస్పేస్ లాంటి కొన్ని రంగాలలో ఉత్పత్తి జరిగితే వాటి వినియోగదారు తానే కాబట్టి ఆ రంగాలలోని పెట్టుబడులను కేంద్రం గుజరాత్, ఉత్తర ప్రదేశ్ లేదా ఆంధ్ర ప్రదేశ్ లలోకి వచ్చేందుకు మార్గం సుగమం చేస్తోందని పేర్కొన్నారు.

భారత దేశం లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్ డీఐ)- తెలంగాణ స్థానం అనే విషయం పై సెస్ లో శనివారం జరిగిన ఒక సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. “రాష్ట్రం లో పెట్టుబడులు రావటానికి మొత్తం దేశంలో వాతావరణం అనుకూలంగా ఉండాలి. పెట్టుబడిదారులకు ప్రపంచం లో మదుపు చేసేందుకు చాలా అవకాశాలున్నాయి, వాళ్ళకు తగిన వాతావరణం కల్పించేందుకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం కేంద్రం 2014 తరువాత తీసుకువచ్చిన సంస్కరణలు మార్గం సుగమం చేశాయి. ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధాని మోడి రాష్ట్రాల స్తాయిలో సంస్కరణలు జరగాలని అర్థం చేసుకున్నారు. అందుకు తగిన చర్యలు చేపట్టటంతో రెడ్ టేప్ తగ్గి తగిన ఫలితాలు వచ్చాయి. అయితే దేశంలో ఉన్న 28 రాష్ట్రాలలో కేవలం 10 లేదా 12 రాష్ట్రాలు మాత్రమే అందుకు తగిన చర్యలు చేపట్టాయి. తెలంగాణ లో టీఎస్ ఐపాస్‌ ను ప్రారంభించి తగిన చర్యలు చేపట్టాము,” అన్నారు.

పెట్టుబడులు రావాలంటే కేవలం తగిన పారిశ్రామిక విధానం వుంటే సరిపోదని అందుకు తగిన వాతావరణం, భూమి, విద్యుత్తు, నిపుణులు తక్కువ వేతనాలకు అందుబాటులో వుండటం, అనువైన చట్టాలు, శాంతి భద్రతలు వుంటేనే పెట్టుబడులు రావటానికి సరిపోదు. వాటిని రాబట్టటానికి తగిన ఎత్తుగడలు వుండాలి అందుకు మీటింగ్ లు పెట్టి వాటిని అందరి దృష్టికి తీసుకెళ్లాలి. అందుకే తెలంగాణ కు ఇదివరకు పెట్టుబడి పెట్టిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ పెడుతున్నపరిస్థితి ఉంది. రాష్ట్రానికి వచ్చిన పావు భాగం పెట్టుబడులు అలా వచ్చినవే. ఇందులో ప్రోక్టర్ & గాంబుల్, లాక్‌హీడ్ మార్టిన్, హిందుస్తాన్ శానిటరీ వేర్ లాంటి కంపెనీలు అలా పెట్టుబడులు పెట్టాయి. అయితే కంపెనీలు హైదరాబాద్ కు రావటానికి ఇక్కడ ఉన్న ఉద్యోగులు కంపెనీలు తక్కువగా మరే లక్షణం ఉండటం, మెరుగైన మౌలిక సదుపాయాలు, బెంగళూరు ఢిల్లీ లాగా ట్రాఫిక్, కాలుష్యం సమస్యలు లేకపోవటం, ఆవిష్కారాలకు తగిన వాతావరణం ఉండి స్టార్ట్ అప్ లు రావటానికి సౌకర్యాలు, వివిధ సాంకేతిక అవసరాలకు తగిన సంస్థలు వుండటం హైదరాబాద్ కు కలిసి వచ్చే అంశాలు అని జయేష రంజన్ వివరించారు.

పరిశ్రమలు రాష్ట్రంలో ఎదుర్కునే సమస్యల గురించి చెబుతూ రాష్ట్రం నీటి పారుదల ప్రాజెక్టులపైన కేంద్రీకరించటంతో పరిశ్రమలకు వాగ్దానం చేసిన ప్రోత్సాహకాలు సమయానికి ఇవ్వలేకపోయాం. ఇప్పుడు వీటిని ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకే రాష్ట్రం కేంద్రం తీసుకువచ్చిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని వాడుకోలేదు. ఐటీ ఈ ప్రోత్సాహకాలపైన ఆధారపడే పరిశ్రమ కాదు. కాబట్టి ఆ రంగం బెంగళూరు, గుర్‌గావ్ ల కంటే ముందుంది అన్నారు. చేయాలనుకున్న అన్ని సంస్కరణలు చేశామని అయితే వాటి అమలులో కొన్ని లోపాలు ఉన్నాయి. ఉత్పాదక రంగంలో కూడా రాష్ట్రం ముందుందని మరో ప్రశ్నకు జవాబుగా చెప్పారు.

ప్రొ. దేబాశిస్ ఆచార్య, ఎఫ్‌డీఐ అనేది ఉత్పాదకతకు, స్పిల్‌ఓవర్ ప్రయోజనాలకు ఎంత ముఖ్యమో వివరించారు. 2024-25 లో 80 శాతం ఎఫ్‌డీఐ మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు లకు మాత్రమే వెళ్ళింది. యిది రాష్ట్రాల మధ్య ఆర్థిక అసమానతలకు దారితీస్తోంది. వివిధ రంగాల మధ్యన కూడా ఈ అసమానతలు ఉన్నాయి. ఐటీ, సర్వీసులు, టెలికాంలలోనే ఇవి ఎక్కువగా కేంద్రీకరణ అయ్యాయి. అయితే, ఎఫ్‌డీఐ ప్రభావాన్ని గణాంకాల ద్వారా ఖచ్చితంగా అంచనా వేయడంలో కొన్ని సవాళ్లున్నాయని చెప్పారు. డా. విజయ్ కుమార్ పెరుగుతున్న ఎఫ్‌డీఐ ప్రభావాన్ని ప్రస్తావిస్తూ, రాష్ట్ర స్థాయిలో, రంగాల వారీగా ఎఫ్‌డీఐ సంబంధిత గణాంకాల లభ్యత లేకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే అభివృద్ది అయిన రాష్ట్రాలు ఎక్కువ పెట్టుబడులు రాబట్టగలుగుతున్నాయి. అలాగే ఇది రాష్ట్రంలోని జిల్లాల మధ్యన కూడా అసమానతలను పెంచుతోందని సెస్ డైరెక్టర్ ప్రొ. ఈ. రేవతి అన్నారు.

ఈ కార్యక్రమం నిర్వహణ లో భాగం అయిన తెలంగాణ ఎకనామిక్ అసోసియేషన్‌ (టీఈఏ) ఉపాధ్యక్షుడు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన ఆర్. వి. రమణ మూర్తి సరళీకరణ విధానాల అమలు తరువాత అభివృద్ది, ఎదుగుదల ఉద్యోగాల కల్పన కు ముఖ్యమైపోయిందన్నారు. రాష్ట్రం పెట్టుబడులు పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నా వాటి వలన ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయనే సమాచారం లేదు. రాష్ట్ర స్తాయిలో ఉన్న ఆర్థిక మరియు గణాంక సంచాలకుల కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల గురించి గణాంకాలు సేకరించాలి. వాటికి అన్ని రకాలుగా అందుతున్న ప్రోత్సాహకాలు గురించి కూడా సమాచారం అవసరమని వాటిని కల్పించాలన్నారు.

Latest