- హుజూరాబాద్, దుబ్బాకలో డిపాజిట్ కోల్పోయి కాంగ్రెస్ అధికారంలోకి రాలేదా?
- జూబ్లీహిల్స్లో ఓడినంత మాత్రాన బీజేపీ పని అయిపోతుందా?
- బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్
హైదరాబాద్, మహా: జూబ్లీహిల్స్ ఎన్నికలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ ఆలస్యంగా అభ్యర్థిని ప్రకటించడం వల్లే ఓటమి పాలైందని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మాత్రం గత ఆరు నెలల నుంచే ఎన్నికల కార్యాచరణ ప్రారంభించాయన్నారు. జూబ్లీహిల్స్లో ఓడినంత మాత్రాన బీజేపీ పని అయిపోయిందని మాట్లాడటం సరికాదన్నారు. ‘హుజూరాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్ అధికారంలోకి రాలేదా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం 9 ఉప ఎన్నికలు జరగ్గా అందులో 7 సందర్భాల్లో అధికార పార్టీ గెలిచింది. రెండింట్లో బీజేపీ గెలిచింది. జూబ్లీహిల్స్ ఎన్నికలో అధికార పార్టీ డబ్బులు, చీరలు పంపిణీ చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడింది. హైదరాబాద్లో పాలనా వ్యవస్థ పూర్తిగా కుంటుపడింది. నగర జనాభాను దృష్టిలో ఉంచుకొని డ్రైనేజీ వ్యవస్థ, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్య నిర్వహణ సరిగా చేపట్టాలి. సీఎం రేవంత్రెడ్డిని కలిసి సమస్యలపై విన్నవిస్తా. ఖాళీగా ఉన్న రెండు పడక గదుల ఇళ్లను వెంటనే కేటాయించాలని, పేదల ఇళ్లను హైడ్రా కూల్చకుండా చూడాలని కోరతా’’అని ఎంపీ ఈటల చెప్పారు.





