- కేంద్రమంత్రి గ్రేటర్ వరంగల్ పర్యటన విజయవంతం
- శ్రీ భద్రకాళి, వేయి స్తంభాల ఆలయాల్లో ప్రత్యేక పూజలు
- రైల్వే తయారీ యూనిట్ ను సందర్శించిన కేంద్ర మంత్రి
- మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- మేడారం జాతరకు జాతీయ హోదా సాధ్యంకాదు
వరంగల్, హన్మకొండ మహా
గ్రేటర్ వరంగల్ లో ఒక రోజు పర్యటనలో భాగంగా శనివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నగరానికి విచ్చేశారు.
హైదరాబాద్ నుండి వందే భారత్ ట్రైన్ లో వరంగల్ కు చేరుకున్నారు. ఆయనకు బిజెపి వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు తో పాటు బిజెపి రాష్ట్ర నాయకులు, కార్యవర్గ సభ్యులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు డాక్టర్ కాళీ ప్రసాద్, కుసుమ సతీష్, తోపాటు ప్రజాప్రతినిధులు రైల్వే ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రేల్వే స్టేషన్ క్యాంటీన్ లో చాయ్ పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహించారు. వరంగల్ రైల్వే స్టేషన్ లో చేపట్టిన అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం నగరంలోని ప్రముఖ ప్రాచీన ప్రసిద్ధిగాంచిన భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకొన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ మేడారం జాతర పై కీలక వ్యాఖ్యలు చేశారు. మేడారం జాతర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పునరుద్ఘాటించారు. హైదరాబాద్ మహా నగరం తర్వాత రెండవ అతి పెద్ద నగరంగా గ్రేటర్ వరంగల్ నగరాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తున్నదని ఓరుగల్లు అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుందని స్పష్టం చేశారు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప, వేయిస్థంబాల గుడికి పూర్వ వైభవం తీసుకు వచ్చామన్నారు. భక్తుల అవసరాలకు తగట్టు వసతులు సమకూరుస్తామని హామీ ఇచ్చారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వ సహకారం కోసం లేఖ రాస్తే ఇప్పటి వరకు ఎటువంటి స్పందన రాలేదని చెప్పారు.
దేశంలో ఏ ఉత్సవాలకు జాతీయ హోదా లేదు
ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం గిరిజన జాతరకు జాతీయ హోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. దేశంలోని ఏ ఉత్సవాలకు జాతీయ హోదా లేదని గుర్తు చేశారు. కాకతీయ సామ్రాజ్య రాజధానిగా విలసిల్లిన ఓరుగల్లుకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కేంద్రంలోని మోదీ సర్కార్ చిత్తశుద్ధితో కృషి చేస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు.
రైల్వే యూనిట్ పనుల పరిశీలిన
హనుమకొండ జిల్లా కాజీపేటలోని రైల్వే తయారీ యూనిట్ ను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పరిశీలించారు.
కాజీపేట లోని రైల్వే తయారీ యూనిట్ ను శనివారం కేంద్ర బొగ్గు గనుల, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, రైల్వే ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి సందర్శించారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ బిజయ్ కుమార్ రత్, సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్. గోపాల కృష్ణన్, ఆర్విఎన్ఎల్ చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ పి.వి. సాయిప్రసాద్, దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఎ. శ్రీధర్ తో పాటు ఇతర సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు. రైల్వే తయారీ యూనిట్లో జరుగుతున్న నిర్మాణ పనులను కేంద్ర మంత్రి పరిశీలించి పనుల పురోగతిని ఆయన సమీక్షించడం తో పాటు నిర్మాణ స్థలంలో భద్రతా అంశాలను పరిశీలించారు.
అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం సాకారమవుతోందని అన్నారు. 2023లో కాజీపేట లో రైల్వే తయారీ యూనిట్ నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారని, పనులు వేగంగా జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. రూ. 521 కోట్ల వ్యయంతో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్విఎన్ఎల్) ఈ ప్రాజెక్టును అమలు చేస్తోందని ఆయన తెలిపారు. మెయిన్ షాప్, టెస్ట్ షాప్, పెయింట్ షాప్, స్టోర్ వార్డ్, అడ్మిన్ బ్లాక్, రెస్ట్ హౌస్, క్యాంటీన్, సెక్యూరిటీ, టాయిలెట్ బ్లాక్స్, బౌండరీ వాల్, ఆర్యుబి, అంతర్గత రైల్వే ట్రాక్, రోడ్లు, ఎలక్ట్రిక్ సబ్స్టేషన్ తో పాటు క్యాంటీన్ లను ఆర్ఎంయులో నిర్మిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇంకా ఒక మెగావాట్ల పై కప్పు సోలార్ ప్లాంట్, సహజ పగటిపూట లైటింగ్, సహజ వెంటిలేషన్, ఎల్ఇడి లైటింగ్, మురుగునీటి శుద్ధి కర్మాగారం, వ్యర్థ జలాల రీసైక్లింగ్ ప్లాంట్, వర్షపు నీటి సేకరణ మొదలైన పనులు కూడా జరుగుతున్నాయని ఆయన తెలిపారు.
75% పనులు పూర్తయ్యాయని, ఈ ప్రాజెక్టును వచ్చే ఏడాది నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. ఆర్ఎంయు లో 16 కోచ్ ఎంఈఎంయు రేకులను తయారు చేయాలని ప్రతిపాదించినట్లు ఆయన తెలిపారు. రాబోయే రైల్వే తయారీ యూనిట్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ఈ ప్రాంతంలోని యువతకు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఉపాధిని కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాలు అపూర్వమైన అభివృద్ధిని సాధిస్తున్నాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. అవి వందే భారత్ రైళ్లు, విద్యుదీకరణ, కొత్త రైళ్లు, అమృత్ స్టేషన్లు, కవాచ్ మొదలైనవి కావచ్చునని తెలిపారు.
ముందుగా, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ స్వాగత ప్రసంగం చేశారు. ఈ ప్రాజెక్టు ముఖ్యాంశాలను ఆర్విఎన్ఎల్ చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ పీవీ. సాయిప్రసాద్ మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమాలలో జిడబ్ల్యూఎంసి కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, బిజెపి వరంగల్ హనుమకొండ జిల్లాల అధ్యక్షులు, బిజెపి సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.






