- యూకేలో డాక్టర్ అంటూ
- హైదరాబాద్ మహిళకు టోకరా
- ఆన్ లైన్ లో పెళ్లి ప్రతిపాదనతో రూ3 లక్షలకు టోకరా
హైదరాబాద్, మహా : హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఆన్ లైన్లో పెళ్లి ప్రతిపాదనతో ఓ మహిళ మోసపోయింది. హిరాద్ అహ్మద్ అనే వ్యక్తి యూకేలో డాక్టర్గా పని చేస్తున్నట్లు ఒక మహిళకు పరిచయమయ్యాడు. కొంతకాలం వాట్సప్ కాల్స్, మెసేజ్లు, వీడియో చాటింగ్ చేసుకున్నారు. తర్వాత హిరాద్ వివాహ ప్రతిపాదన చేయగానే సదరు మహిళ అంగీకరించింది. వెంటనే రెండు బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేయాలని, కొత్త సిమ్ కార్డులు తీసుకోవాలని ఒత్తిడి చేశాడు. బ్యాంకు పాస్బుక్లు, ఏటీఎం కార్డులను న్యూఢిల్లీలోని యూకే వ్యవహారాల కార్యాలయానికి పంపాలని ఆమెను తొందరపెట్టాడు.
పైగా ఆమెకు వీసా, వివాహ పత్రాలను కూడా పంపాడు. ప్రాసెసింగ్ ఫీజులు, వీసా ఫీజులు, ఆలస్యానికి జరిమానాలు, లగేజ్ సమస్యలు, హోటల్ బస ఇలా వివిధ కారణాలు చెప్పి డబ్బులు కావాలని అడిగాడు. తనకు వచ్చిన వీసా, వివాహ పత్రాలు అన్నీ నిజమే అనుకున్న మహిళ హిరాద్ అడిగినట్లుగా రూ 3.38 లక్షలు ఇచ్చింది. డబ్బులు పంపిన వెంటనే హిరాద్ ఫోన్ స్విచ్చాఫ్ అని రావటమే కాకుండా అప్పటినుండి కాంటాక్ట్ కూడా నిలిచిపోవటంతో తాను మోసపోయినట్లు గ్రహించి మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సైదాబాద్ కు చెందిన ఈ మహిళ మ్యాట్రిమోనీ సైట్ ద్వారా యువకుడికి పరిచయమైంది. గుర్తు తెలియని యువకుడు తనను పెళ్లిచేసుకుంటానని చెప్పడంతో మహిళ నమ్మింది. మహిళకు పంపిన విసా, పెళ్లికి సంబంధించిన డాక్యుమెంట్స్ ను పరిశీలించిన పోలీసులు అన్నీ నకిలీవని తేల్చారు. మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






