- మహిళా ఐఏఎస్ను కించపరిచేలా ఆరోపణలు
- సజ్జనార్ నేతృత్వంలో సిట్
- రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..
హైదరాబాద్, మహా : మహిళా ఐఏఎస్ ఆఫీసర్ను కించపరిచేలా వార్తలు ప్రసారం చేసిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో 8 మందితో సిట్ ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా ఏఐఎస్పై ఆరోపణలు చేసిన విషయంలో పలు మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానెళ్లపై కేసు నమోదైన వి,యం తెలిసిందే. అంతేకాకుండా రేవంత్ రెడ్డి ఫొటోలు అసభ్యకరంగా పోస్టు చేసిన వ్యవహారంలో కూడా మరో కేసు నమోదైంది. వీటిని విచారించేందుకు తాజాగా సిట్ ఏర్పాటైంది. ఈ ప్రత్యేక బృందంలో నార్త్ రేంజ్ జాయింట్ సీపీ శ్వేత, చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతమ్, హైదరాబాద్ అడ్మిన్ డీసీపీ వెంకట లక్ష్మి, సైబర్ క్రైమ్ డీసీబీ అరవింద బాబు, విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ ప్రతాప్, సీసీఎస్ ఏసీపీ గురు రాఘవేంద్ర, సైబర్ సెల్ సీఐ శంకర్ రెడ్డి, కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఎస్సై హరీశ్ ప్రత్యేక దర్యాప్తు బృందంలో ఉన్నారు.
మహిళా ఐఏఎస్ను కించపరిచేలా వార్తలను ప్రచారం చేయడంపై సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)లో కేసు నమోదు అయింది. ఈ మేరకు అఖిల భారత అధికారుల (ఐఏఎస్) సంఘం కార్యదర్శి జయేశ్ రంజన్ ఫిర్యాదు మేరకు.. రెండు తెలుగు న్యూస్ ఛానళ్లతో పాటు మరో 7 యూట్యూబ్ ఛానళ్లపై, భారతీయ న్యాయ సంహితలోని 75, 78, 79, 351(1), 351(2) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు, సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలు అసభ్యకరంగా పోస్టు చేసి తెలంగాణ పబ్లిక్ టీవీ వాట్సప్ గ్రూప్లో పోస్టు చేశారని, కావలి వెంకటేశ్ అనే వ్యక్తిపై కాంగ్రెస్ నేత గూళ్ల నరసింహ ఫిర్యాదు ఇచ్చారు. దీనిపై జనవరి 11న మద్దూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులను విచారించడానికి తాజాగా తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ విషయంపై విచారణ త్వరగా పూర్తి చేసి, అభియోగపత్రం దాఖలు చేయాలని సిట్ను డీజీపీ ఆదేశించారు.
కాగా, మహిళా ఐఏఎస్ను కించపరిచేలా చేసిన ప్రచారంపై తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం ఇటీవల తీవ్రంగా స్పందించింది. ఆమెపై చేసిన ఆరోపణలను ఖండించింది. అన్ని వేదికలు వారు చేసిన కంటెంట్ను వెనక్కితీసుకోవడంతో పాటు.. తక్షణం, బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. అవమానకరమైన కంటెంట్ను సృష్టించి, ప్రచారం చేసిన వారిని కోర్టు మందు నిలబెట్టడానికి చట్టపరమైన మార్గాలను కూడా తమ అసోసియేషన్ అన్వేషిస్తోందని పేర్కొంది.
ఐపీఎస్ ల సంఘం సంఘీభావం
ఈ వ్యవహారంలో ఐపీఎస్ అధికారుల సంఘం కూడా సంఘీభావం ప్రకటించింది. మహిళా ఐఏఎస్ ఆఫీసర్పై కొన్ని మీడియా సంస్థలు ప్రసారం చేశాయి. ‘బాధ్యతారాహిత్యమై, ద్వేషపూరిత, పరువుకు నష్టం కలిగించే’ కంటెంట్ అని పేర్కొంది. మహిళా ఐఏఎస్ అధికారిపై నిరాధారమైన ఆరోపణలు మోపారని చెప్పింది.








