సీయం సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి . ప్రభుత్వ సలహాదారు
ఆదిలాబాద్ మహా: ముఖ్యమంత్రి బహిరంగ సభకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, పర్యాటక శాఖ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు,ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి జిల్లాపర్యటన నేపథ్యంలో బుధవారం నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో చేపట్టిన ఏర్పాట్లను మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు చేపట్టిన ఏర్పాట్ల వివరాలను కలెక్టర్ మంత్రికి వివరించారు. సభ నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అంతకుముందు, ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు పట్టణానికి చేరుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిలకు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అటవీ శాఖ అతిథి గృహంలో పూల మొక్కను అందజేసి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మంత్రికి, ప్రభుత్వ సలహాదారుకు గౌరవ వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, జిల్లా ఎస్పీ జానకి షర్మిల, అదనపు ఎస్పీ సాయికిరణ్, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీవో రత్న కళ్యాణి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.








