మహా
కువైట్ గగనతలంలో అమెరికా యుద్ధవిమానాల ప్రమాదం కలకలం రేపింది. మిత్ర దేశాల మధ్య సమన్వయం లోపం వల్లే ఆ ఘటన చోటుచేసుకున్నట్టుగా తెలిసింది. సోమవారం ఉదయం మూడు అమెరికా ఫైటర్ జెట్లను కువైట్ వైమానిక రక్షణ దళాలు పొరపాటున కాల్చివేసినట్లు పెంటగాన్ వెల్లడించింది. దీనిని ఫ్రెండ్లీ ఫైర్ ఘటనగా అభివర్ణించింది. ప్రమాదానికి గురైన మూడు ఎఫ్-15 యుద్ధ విమానాల్లో ఉన్న ఆరుగురు సిబ్బంది సమయానికి ఎజెక్ట్ కావడంతో ప్రాణాపాయం తప్పిందని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ప్రస్తుతం వారందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై కువైట్ ప్రభుత్వం కూడా అధికారిక ప్రకటన విడుదల చేసింది. సోమవారం ఉదయం పలు అమెరికా సైనిక విమానాలు కూలిపోయాయని కువైట్ రక్షణ శాఖ ధ్రువీకరించింది. వెంటనే శోధన, రక్షణ చర్యలు చేపట్టి సిబ్బందిని ఆసుపత్రులకు తరలించామని తెలిపింది. అమెరికా బలగాలతో నేరుగా సమన్వయం చేసుకుని ఘటనకు గల కారణాలపై సంయుక్త దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొంది.







