- ‘మీ చమురు మీరే తెచ్చుకోండి!’
- ఇరాన్పై చర్యల్లో సహకరించని దేశాలపై ఆగ్రహం.
- ‘ట్రూత్ సోషల్’లో అమెరికా అధ్యక్షుడి సంచలన పోస్ట్.
వాషింగ్టన్, మహా.
మిత్రదేశాల తీరుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇరాన్పై సైనిక చర్యల విషయంలో అమెరికాకు సహకరించని దేశాలు, తమకు కావాల్సిన చమురును తామే స్వయంగా సమకూర్చుకోవాలని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన తన సొంత సామాజిక మాధ్యమ వేదిక ‘ట్రూత్ సోషల్’లో పెట్టిన పోస్టు ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది.
ముఖ్యంగా బ్రిటన్ వంటి దేశాలను ఉద్దేశించి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ను దెబ్బతీసే చర్యల్లో పాల్గొనడానికి నిరాకరించిన దేశాలకు కేవలం రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా వద్ద పుష్కలంగా ఉన్న చమురును కొనుగోలు చేయడం ఒకటవ మార్గం కాగా, కాస్త ధైర్యం తెచ్చుకుని నేరుగా హర్మూజ్ జలసంధికి వెళ్లి తమకు కావాల్సిన చమురును తామే తెచ్చుకోవడం రెండో మార్గమని ఆయన ఎద్దేవా చేశారు. మిత్రదేశాలు ఇకనైనా తమ కోసం తాము పోరాడటం నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు.
తమకు అవసరమైనప్పుడు దూరంగా ఉన్న దేశాలకు అమెరికా కూడా భవిష్యత్తులో సాయం చేసే ప్రసక్తే లేదని ట్రంప్ తేల్చిచెప్పారు. “ఇరాన్ను మేము ఇప్పటికే గట్టిగా దెబ్బతీశాం, అత్యంత కష్టమైన పని పూర్తయింది. ఇకపై మీ రక్షణ, మీ చమురు అవసరాలు మీరే చూసుకోవాలి” అని ఆయన స్పష్టం చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించి నెల రోజులు దాటినప్పటికీ, కీలకమైన హర్మూజ్ జలసంధిపై ఇరాన్ తన పట్టును ఇంకా కొనసాగిస్తూనే ఉంది.
ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో ఐదో వంతు ఈ జలసంధి గుండానే రవాణా అవుతుండటంతో, ఇరాన్ విధిస్తున్న దిగ్బంధనం అంతర్జాతీయ మార్కెట్లను వణికిస్తోంది. చమురు ధరలు విపరీతంగా పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుదేలవడమే కాకుండా, సామాన్యుడిపై నిత్యావసరాల ధరల భారం పెరుగుతోంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మిత్రదేశాల మధ్య సంబంధాలను మరింత ఉద్రిక్తంగా మార్చేలా కనిపిస్తున్నాయి.








