- కేంద్ర బలగాల ఉపసంహరణకు ససేమిరా!
ఢిల్లీ, మహా.
పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఎస్ఆర్) ప్రక్రియలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో నెలకొన్న అసాధారణ పరిస్థితులు, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతానికి కేంద్ర బలగాలను ఉపసంహరించే ప్రసక్తే లేదని ధర్మాసనం తేల్చిచెప్పింది. ఓటర్ల జాబితా నుంచి తొలగింపునకు గురైన సుమారు 60 లక్షల మందికి సంబంధించిన క్లెయిమ్లు, అభ్యంతరాలను సోమవారం అర్ధరాత్రి లోపు పరిష్కరించాలని ఆదేశించింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం. పాంచోలిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు విచారణ చేపట్టింది.
కోల్కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పంపిన నివేదికను ఉటంకిస్తూ.. సోమవారం మధ్యాహ్నం నాటికే సుమారు 59.15 లక్షల క్లెయిమ్లను జ్యుడీషియల్ అధికారులు విజయవంతంగా పరిష్కరించారని ధర్మాసనం సంతృప్తి వ్యక్తం చేసింది. అయితే, క్షేత్రస్థాయిలో విధుల్లో ఉన్న అధికారుల భద్రతపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా మాల్దా జిల్లాలో జ్యుడీషియల్ అధికారులను ఘెరావ్ చేసిన ఘటనను ప్రస్తావిస్తూ.. అధికారులకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైతే తాము కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని హెచ్చరించింది. “రాష్ట్ర యంత్రాంగం తన విధిని నిర్వహించలేకపోతే, తదుపరి చర్యలు ఏంటో మాకు తెలుసు” అని సీజీఐ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
మరోవైపు, ఎన్నికల కమిషన్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది డి.ఎస్. నాయుడు కోర్టుకు కీలక సమాచారం అందించారు. పెండింగ్లో ఉన్న మిగిలిన క్లెయిమ్లను ఈ రోజు రాత్రి లోపే పూర్తి చేసి, అనుబంధ ఓటర్ల జాబితాను ప్రచురిస్తామని హామీ ఇచ్చారు. అయితే, భారీ సంఖ్యలో ఉన్న దరఖాస్తులకు సంబంధించి డిజిటల్ సంతకాలను అప్లోడ్ చేయడానికి కొంత సమయం పడుతుందని, ఇందుకు ఏప్రిల్ 7 వరకు గడువు ఇవ్వాలని కోరగా ధర్మాసనం అంగీకరించింది. అప్పీళ్ల విచారణ కోసం ఏర్పాటు చేసిన 19 ట్రిబ్యునళ్లు ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదన్న విమర్శలపై కూడా కోర్టు స్పందించింది.
ట్రిబ్యునళ్ల పనితీరును క్రమబద్ధీకరించేందుకు ముగ్గురు మాజీ సీనియర్ న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కోల్కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కమిటీ ఏప్రిల్ 7 నాటికి ఏకరీతి విధివిధానాలను ఖరారు చేయాలని సూచించింది. ఓటర్ల తొలగింపునకు గల కారణాలను క్షుణ్ణంగా పరిశీలించే అధికారంతో పాటు, ఆన్లైన్లో అందుబాటులో లేని ఇతర ఆధారాలను కూడా సమీక్షించే వెసులుబాటు ఈ ట్రిబ్యునళ్లకు ఉంటుందని స్పష్టం చేసింది. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఈ ప్రక్రియ సాగాలని, ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంపొందించడమే ఎన్నికల కమిషన్ ప్రాథమిక విధి అని జస్టిస్ బాగ్చీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ విచారణతో బెంగాల్ ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రక్రియ క్లైమాక్స్కు చేరుకున్నట్లయింది.








