జగిత్యాల, మహా : కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంటూ, కష్టకాలంలోనూ పార్టీ జెండా మోసిన సీనియర్ నేత జీవన్ రెడ్డి.. ఇప్పుడు అదే పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ కు జై కొట్టారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను కాంగ్రెస్ లో చేర్చుకోవడం.. మున్సిపల్ ఎన్నికల ముందే ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడం జీవన్ రెడ్డిని తీవ్ర అసహనానికి గురిచేసింది. గెలిచిన నేతలను చేర్చుకుంటూ ఓడిన మమ్మల్ని అవమానిస్తారా అంటూ ఆయన పార్టీకి గుడ్ బై చెప్పారు. ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన గులాబీ తీర్థం పుచ్చుకునేందుకు ముహూర్తం ఖరారైంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసంలో కలిసి పార్టీలోకి రావాలని ఆహ్వానించడం, అందుకు జీవన్ రెడ్డి సుముఖత వ్యక్తం చేయడం కూడా పూర్తయింది.
సెక్రటరీ జనరల్ పదవి
కేకే వదిలి పెట్టిన సెక్రటరీ జనరల్ పదవిని జీవన్ రెడ్డికి కట్టబెట్టడం ఖాయమని తెలుస్తోంది. అయితే పార్టీలో కేసీఆర్ తర్వాత అంతటి ప్రాధాన్యత ఉన్న పదవిని, కొత్తగా వచ్చిన వ్యక్తికి కట్టబెట్టడంపై మొదటి నుండి కారు పార్టీని నమ్ముకున్న సీనియర్లలో అసంతృప్తిని కలిగించే అవకాశం ఉంది. ఎంతో కాలంగా పార్టీని అంటిపెట్టుకున్న ఇతర ఉమ్మడి కరీంనగర్ నేతలను పక్కనపెట్టి, నిన్నటిదాకా తమను తిట్టిన నేతకు రెడ్ కార్పెట్ వేయడం ఏమిటని కొందరు నేతలు అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటున్నారు.
ఉమ్మడి జిల్లాలో నాయకత్వ పోరు
జీవన్ రెడ్డి రాకతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నాయకత్వ సమీకరణాలు పూర్తిగా మారిపోనున్నాయి. ఇప్పటికే జిల్లాలో గంగుల కమలాకర్ వంటి బలమైన నేతలు ఉండగా, ఇప్పుడు జీవన్ రెడ్డి వంటి దిగ్గజం చేరడం ఆధిపత్య పోరు కు దారితీయవచ్చు. ముఖ్యంగా జగిత్యాలలో బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పుడు ఎవరి కింద పనిచేయాలన్న గందరగోళంలో ఉన్నాయి. నిన్నటిదాకా కొట్టుకున్న వర్గాలు ఇప్పుడు ఒకే జెండా కింద ఎలా కలిసి సాగుతాయన్నది పెద్ద ప్రశ్న. జగిత్యాల నియోజకవర్గంలో జీవన్ రెడ్డికి ఉన్న వ్యక్తిగత ఇమేజ్ బీఆర్ఎస్కు బలంగా మారవచ్చు కానీ, అది పాత క్యాడర్లో చీలిక తెచ్చే ప్రమాదం ఉంది. సంజయ్ కుమార్ వైఖరికి వ్యతిరేకంగా జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి వస్తుండటంతో, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు, ద్వితీయ శ్రేణి నాయకులు రెండు గ్రూపులుగా విడిపోయే అవకాశం ఉంది.
ఇటీవలి కాలంలో గెలవని జీవన్ రెడ్డి
ఎన్నో అవకాశాలు వచ్చినా గెలవని జీవన్ రెడ్డిని చేర్చుకోవడం వల్ల పార్టీకి లాభమా లేక నష్టమా అనే చర్చ బీఆర్ఎస్లో జరుగుతున్నా, ఆయన అనుభవం పార్టీకి అవసరమని అధిష్టానం గట్టిగా నమ్ముతోంది. అయితే, ఈ నిర్ణయం కరీంనగర్ గులాబీ తోటలో ముళ్లు జల్లినట్టే అవుతుందన్నది విశ్లేషకుల అంచనా. జీవన్ రెడ్డికి అంత ప్రజాబలం లేదని.. అయనకు బదులుగా యువనేతల్ని ప్రోత్సహిస్తే మంచిదని.. గతంలో కేకేను ప్రోత్సహిస్తే ఏం జరిగిందో తెలుసుకదా అని క్యాడర్ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే జగిత్యాల నుంచి పార్టీ సీనియర్ నేత ఎల్ రమణ బీఆర్ఎస్ లో ఉన్నారు. అయితే జీవన్ రెడ్డి రాకపై ఆయన ఎక్కడా ఏ మాత్రం స్పందించడం లేదు. మరో వైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి సీనియర్ నేతగా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఉన్నారు. వీరందరినీ పక్కకు పెట్టి జీవన్ రెడ్డికి ప్రాతినిధ్యం ఇవ్వడం పట్ల పార్టీలో తీవ్ర చర్చ మొదలైంది.







