ఏపీ రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు. గతంలో స్తంభించిపోయిన భవనాల నిర్మాణ పనులను పునఃప్రారంభించారు. ఇందులో భాగంగా రాజధాని అభివృద్ధి అథారిటీ కార్యాలయ నిర్మాణ పనులను లాంఛనంగా శ్రీకారం చుట్టారు.
అమరావతి పరిధిలోని తుళ్లూరు మండలం ఉద్దండరాయుని పాలెం-రాయపూడి వద్ద ఈ పనులను మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, ఇతర అధికారులతో కలిసి ప్రారంభించారాయన. ఈ సందర్బంగా ప్రత్యేక పూజలు చేశారు. పండితుల వేద మంత్రోచ్ఛారణల నిర్మాణ పనులను చేపట్టారు. దీని నిర్మాణ అంచనా వ్యయం 160 కోట్ల రూపాయలు.
మొత్తం ఏడంతస్తుల్లో ఈ భవనం నిర్మితం కానుంది. 2014- 201 మధ్యకాలంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే సీఆర్డీఏ భవన నిర్మాణ పనులు మొదలైన విషయం తెలిసిందే. అప్పటి టీడీపీ ప్రభుత్వం మొత్తం ఆరున్నర ఎకరాల స్థలాన్ని సీఆర్డీఏకు మంజూరు చేసింది.
ఆ తరువాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావడం, పాలన వికేంద్రీకరణ, మూడు రాజధానుల కాన్సెప్ట్ను తెర మీదికి తీసుకుని రావడంతో అమరావతి నిర్మాణ పనులు స్తంభించాయి. ఇందులో మూడున్నర ఎకరాల్లో ఏడు అంతస్తుల భవనం రూపుదిద్దుకుంటుంది. వాహనాల పార్కింగ్, కాంపౌండ్ ఆవరణ కోసం మరో రెండున్నర ఎకరాల స్థలాన్ని కేటాయించారు.
నిర్మాణ పనులను ప్రారంభించిన అనంతరం చంద్రబాబు మాట్లాడారు. తాము చరిత్రను తిరగరాయబోతోన్నామని వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సైబరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దానని గుర్తు చేశారు. హైదరాబాద్, సైబరాబాద్ నగరాన్ని నిర్మించిన అనుభవం తనకు ఉందని చెప్పారు.
రాష్ట్ర విభజన అనంతరం రాజధానిని కోల్పోవాల్సి వచ్చిందని, ఇప్పుడు మళ్లీ దాన్ని పునర్నిర్మించుకుంటోన్నామని అన్నారు. మధ్యలో అయిదు సంవత్సరాల పాటు అభివృద్ధిని ఉద్దేశపూరకంగా అడ్డుకున్నారని, అలాంటి వాళ్లు ప్రతిచోటా ఉంటారని పరోక్షంగా వైఎస్ఆర్సీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
29,000 మంతి అమరావతి ప్రాంత రైతులు రాజధాని నిర్మాణానికి 54,000 ఎకరాలను అప్పగించారని చెప్పారు. ఇన్ని ఎకరాలను సేకరించిన ఘనత తమదేనని, రైతులు ఉదారంగా ముందుకు వచ్చి భూములను త్యాగం చేశారని ప్రశంసించారు. ఈ నగరం రాజధాని మాత్రమే కాదని, దేశం గర్వించేలా నిర్మిస్తామని పేర్కొన్నారు. దీనికోసం అద్భుతమైన బ్లూప్రింట్ సిద్ధం చేశామని చెప్పారు. విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా తయారు చేస్తామని హామీ ఇచ్చారు.








