Mahaa Daily Exclusive

  సింగరేణిని కేసీఆర్ రాజకీయ వేదికగా మార్చారు..

Share

  • సింగరేణిని కేసీఆర్ రాజకీయ వేదికగా మార్చారు
  • దక్షిణాదిలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థ సింగరేమి
  • నాలుగు రాష్ట్రాలతో పాటు ఎన్టీపీసీకి బొగ్గు సరఫరా చేస్తోంది
  • ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ, మహా : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి సంస్థను తీవ్రంగా మోసం చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… సింగరేణి దక్షిణాదిలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థ అని, తెలంగాణతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలతో పాటు ఎన్టీపీసీకి ఇది బొగ్గును సరఫరా చేస్తోందని గుర్తుచేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తన స్వార్థ రాజకీయాల కోసం సింగరేణిని వాడుకుని, దానికి తీవ్ర ఆర్థిక నష్టాన్ని చేకూర్చిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి ఈ సంస్థలో 49 శాతం వాటా, తెలంగాణ ప్రభుత్వానికి 51 శాతం వాటా ఉందన్న ఆయన… కేసీఆర్ పాలనలో సింగరేణిని ఒక రాజకీయ వేదికగా మార్చేసి, దాని ఆదాయానికి కోలుకోలేని గండి కొట్టారని విమర్శించారు. కార్మికుల సంక్షేమం, సంస్థ అభివృద్ధిని పక్కనబెట్టి రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చారని మండిపడ్డారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ సింగరేణి పరిస్థితిలో పెద్దగా మార్పు ఏమీ రాలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి, సింగరేణి పునరుద్ధరణకు, కార్మికుల సంక్షేమానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కిషన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.