Mahaa Daily Exclusive

  ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్..

Share

• యూనిట్ విద్యుత్‌ రూ.1.50కే.
• జూన్‌ 1 నుంచి రాయితీ అమలు.

అమరావతి, మహా.

ఆక్వా రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్వా సాగుకు అందిస్తున్న విద్యుత్‌ రాయితీని కొనసాగిస్తూ రాష్ట్ర ఇంధన శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీవో ఆర్టీ నంబర్‌ 57 ప్రకారం అర్హులైన ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్‌ను కేవలం రూ.1.50కే అందించనున్నారు. నిర్ణయించిన రాయితీ ధర మినహా అదనపు విద్యుత్‌ ఛార్జీలు వసూలు చేయరాదని విద్యుత్‌ పంపిణీ సంస్థలను ప్రభుత్వం ఆదేశించింది.

పెరుగుతున్న విద్యుత్‌, మేత, మందులు, నిర్వహణ ఖర్చులతో ఆక్వా రైతులు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం వారికి కొంత ఊరట కల్పించనుంది. రొయ్యలు, చేపల సాగులో విద్యుత్‌ ఖర్చు కీలక వ్యయంగా ఉండటంతో రాయితీ కొనసాగింపు రైతుల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించేందుకు దోహదపడనుంది.

జూన్‌ 1 నుంచే అమలు

ప్రభుత్వం ప్రకటించిన విద్యుత్‌ రాయితీ జూన్‌ 1 నుంచే అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. కొత్తగా గుర్తించిన ఆక్వా జోన్ల పరిధిలో ఉండి, ఆంధ్రప్రదేశ్‌ సముద్ర ఆక్వా అభివృద్ధి సంస్థ కింద నమోదైన సుమారు 6,500 ఆక్వా సాగు క్షేత్రాలకు ప్రస్తుతం ఈ ప్రయోజనం అందనుంది.

రాయితీ ప్రయోజనం కేవలం ప్రస్తుతం నమోదై ఉన్న ఆక్వా ఫారాలకే పరిమితం కాదని అధికారులు స్పష్టం చేశారు. భవిష్యత్తులో కొత్తగా ఆక్వా సాగు ప్రారంభించి, నిబంధనల ప్రకారం నమోదు చేసుకునే ఫారాలకు కూడా వారి నమోదు తేదీ నుంచి విద్యుత్‌ రాయితీ వర్తించనుంది.

డిస్కంలకు రైతుల వివరాలు

రాయితీ పథకం అమలులో ఎలాంటి గందరగోళానికి తావులేకుండా అర్హులైన ఆక్వా రైతులు, ఫారాల వివరాలను రాష్ట్ర మత్స్యశాఖ నేరుగా విద్యుత్‌ పంపిణీ సంస్థలకు అందించనుంది. మత్స్యశాఖ అందించే అర్హత జాబితా ఆధారంగా సంబంధిత విద్యుత్‌ కనెక్షన్లకు రాయితీ ధరను వర్తింపజేయాలని డిస్కంలను ప్రభుత్వం ఆదేశించింది.

ఆక్వా రంగంపై ఆధారపడి జీవిస్తున్న రైతులకు ఉత్పత్తి వ్యయాన్ని నియంత్రించడంతో పాటు సాగును మరింత ఆర్థికంగా నిలకడగా కొనసాగించేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. విద్యుత్‌ రాయితీ కొనసాగింపుతో ఆక్వా రైతులకు తక్షణ ఆర్థిక భారం తగ్గడంతో పాటు రాష్ట్రంలోని ఆక్వా రంగానికి మరింత ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది.

Latest