ఆదిలాబాద్, మహా: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టేలా మన పండుగల ప్రాముఖ్యతను తెలియజేసేలా ముగ్గుల పోటీలను ఏర్పాటు చేయడం సంతోషకరమంటూ కేఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్, కంది శ్రీనివాసరెడ్డి సతీమణి, ముగ్గుల పోటీల స్పాన్సరర్ కంది మౌనా శ్రీనివాస రెడ్డి అన్నారు. శనివారం స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించిన ముగ్గుల పోటీల విజేతలకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిర్వాహకులు పూల బొకేతో స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాలన్నారు. ముఖ్యంగా చదువుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఉన్నత చదువులతో ఆర్థికంగా ఎదగడానికి వీలుంటుందన్నారు. తమది కూడా దిగువ మధ్య తరగతి కుటుంబమేనని, ఉన్నత చదువులతో కష్టపడి ఈ స్థితికి వచ్చినట్టు తెలిపారు. ఇప్పటికే కంది శ్రీనివాస రెడ్డి ఫౌండేషన్ ద్వారా అనేక సామాజిక సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, దాంతో పాటే ఇలాంటి మంచి కార్యక్రమాలకు కూడా తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. మనం సంపాదించే దాంట్లో కొంత సమాజానికి కేటాయించాలన్నారు. తమ సంపాదనలో సగం కేఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాల కోసం వినియోగిస్తున్నామన్నారు. ఆధునిక యుగంలో పండుగలు, సంస్కృతీ సంప్రదాయాలను మరిచి పోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మనం జరుపుకునే ప్రతీ పండుగలో సంప్రదాయంతోపాటు సైన్స్ కూడా దాగుందన్నారు. ఈ ముగ్గుల పోటీలలో పాల్గొన్న అందరినీ ఆమె అభినందించారు. పోటీ అన్నప్పుడు గెలుపోటములుంటాయని, ఓడినవారు నిరుత్సాహపడకుండా తిరిగి గెలుపు కోసం ప్రయత్నించాలన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలిచిన స్ఫూర్తి, అశ్విని, రాణిలకు ప్రత్యేక అభినందనలు తెలిపి నగదు బహుమతులను అందజేశారు. అదేవిధంగా నాల్గొవ బహుమతితోపాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కన్సోలేషన్ బహుమతులు అందించారు. ఈ పోటీలకు డీఆర్డీడీఏ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ హేమలత, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు వనజ, ప్రధాన కార్యదర్శి ప్రమీల న్యాయ నిర్ణేతలుగా వ్వవహరించారు. ఈ కార్యక్రమంలో డీవైఎస్ఓ వెంకటేశ్వర్లు, బండారి దేవన్న, శ్రీలేఖ ఆదివాసీ, ఉమామహేశ్వరి, గంగామణి, రమ, ఖయ్యూం, మానె శంకర్, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.






