- తెలంగాణలో మరో ఎయిర్ పోర్ట్
- అంతర్గాం ఎయిర్ పోర్టుకు కన్సల్టెన్సీ నిధులు
- 591.24 ఎకరాల్లో ఏర్పాటు
- సాధ్యాసాధ్యాలపై అధ్యయనం కోసం రూ. 40.53 కోట్లు విడుదల
హైదరాబాద్, మహా : ప్రాంతీయ విమాన అనుసంధానం పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. పెద్దపల్లి జిల్లా అంతర్గాం వద్ద ప్రతిపాదిత ఎయిర్పోర్టు నిర్మాణానికి సంబంధించిన సాధ్యాసాధ్యాల అధ్యయనం కోసం రూ. 40.53 లక్షల నిధులు ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) కు మంజూరు చేసింది. ఇప్పటికే వరంగల్లోని మమ్నూరు, ఆదిలాబాద్లో విమానాశ్రయాల నిర్మాణ ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలో పారిశ్రామిక, పర్యాటక రంగాల అభివృద్ధికి దోహదపడతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. తెలంగాణలో ప్రాంతీయ వైమానిక అనుసంధానం పెంపొందించేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లాలోని అంతర్గాం వద్ద ప్రతిపాదిత ప్రాంతీయ విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించిన సాధ్యాసాధ్యాల అధ్యయనం చేపట్టేందుకు నిధులు మంజూరు చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ అయ్యాయి.
పెద్దపల్లి జిల్లా అంతర్గాం వద్ద నిర్మించాలని ప్రతిపాదించిన ప్రాంతీయ విమానాశ్రయం ప్రాజెక్టుకు సంబంధించి సాధ్యాసాధ్యాల నివేదిక తయారీ కోసం రూ.40.53 లక్షలు కన్సల్టెన్సీ ఫీజుగా మంజూరు చేస్తూ రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ప్రాజెక్టును మొదట్లో బసంత్నగర్లో నిర్మించాలని యోచించినా.. అక్కడ గుర్తించిన స్థలంపై చేసిన సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాల నివేదిక అనుకూలంగా రాలేదు. దీంతో ప్రత్యామ్నాయంగా అంతర్గాంలో 591.24 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించారు. ప్రస్తుతం ఈ కొత్త స్థలంపై సమగ్రమైన నివేదికను సిద్ధం చేసే బాధ్యతలను ఏఏఐ కన్సల్టెన్సీకి అప్పగించారు.
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఇతర విమానాశ్రయాలు
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పారిశ్రామిక, పర్యాటక, వాణిజ్య రంగాల వృద్ధి కోసం ప్రధాన నగరాలకు వైమానిక అనుసంధానాన్ని పెంచడానికి బహుళ విమానాశ్రయాల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తోంది. చారిత్రక వరంగల్ నగరానికి సమీపంలో ఉన్న మమ్నూరు వద్ద ఎయిర్పోర్టు నిర్మాణానికి సంబంధించిన చర్యలు ఇప్పటికే ముమ్మరమయ్యాయి. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, ఐటీ కారిడార్ వంటి ముఖ్య ప్రాజెక్టులు ఉన్నందున, వరంగల్లో ఎయిర్పోర్టు ప్రాంతీయ అభివృద్ధికి కీలకం కానుంది. రాష్ట్రానికి ఉత్తర భాగంలో ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఎయిర్పోర్టు నిర్మాణ ప్రతిపాదనలు ఊపందుకున్నాయి. ఈ ఎయిర్పోర్టు నిర్మాణం వలన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలకు చెందిన ప్రజలకు, వ్యాపారాలకు గణనీయమైన ప్రయోజనం చేకూరుతుంది. రాష్ట్ర ముఖ్య పట్టణాలలో విమానాశ్రయాలను నిర్మించడం వల్ల పెట్టుబడులు పెరగడంతో పాటు.. ప్రాంతీయ అసమానతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఈ ప్రాంతీయ విమానయాన కేంద్రాలు వ్యాపార విస్తరణకు, పర్యాటక రంగం అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయి. అంతర్గాంలో విమానాశ్రయం ఏర్పాటైతే.. ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజల దశాబ్దాల కలను నెరవేర్చడంతో పాటు.. సింగరేణి, ఇతర పరిశ్రమల అవసరాలను తీర్చనుంది.





