- తెలంగాణ గేమ్ ఛేంజర్గా ఆయిల్ పామ్
- దేశానికే ఆయిల్ పామ్ హబ్గా రాష్ట్రం మారనుంది
- పది లక్షల ఎకరాల్లో సాగు చేయడానికి టార్గెట్గా పెట్టుకున్నాం
- రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
భద్రాద్రి కొత్తగుడెం, మహా: తెలంగాణ గేమ్ ఛేంజర్గా ఆయిల్ పామ్ సాగవుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. దేశానికే ఆయిల్ పామ్ హబ్గా తెలంగాణ రాష్ట్రం మారనుందని ఉద్ఘాటించారు. ఆదివారం భద్రాద్రి కొత్తగుడెం జిల్లాలోని దమ్మపేట మండలం అప్పారావుపేట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలో పామాయిల్ రైతుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనంలో మంత్రి తుమ్మల, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పాల్గొన్నారు. పామాయిల్ రైతులతో ముఖాముఖి చర్చలో రైతుల అనుభవాలు, ఆయిల్ ఫెడ్ ఉద్యోగుల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మంత్రి తుమ్మల మాట్లాడారు. మన దేశానికి వంట నూనెలు దిగుమతి చేసుకోకుండా ఆయిల్ పామ్ సాగుతో స్వయం సమృద్ధి సాధించవచ్చని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పుకొచ్చారు. ప్రతి ఏడాది లక్ష కోట్ల రూపాయల విలువ గల పామాయిల్ దిగుమతి చేసుకుంటున్నామని వివరించారు. పది లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయడానికి టార్గెట్గా పెట్టుకున్నామని వివరించారు. యూరియా వల్లే క్యాన్సర్ మహమ్మారి ప్రబలుతోందని చెప్పుకొచ్చారు. పంజాబ్ మాదిరిగా తెలంగాణ క్యాన్సర్ బారిన పడకుండా అప్రమత్తం కావాలని సూచించారు. పురుగు మందుల ఎరువులు ఎక్కువ వినియోగంతో అన్నదాతలు క్యాన్సర్, అనేక రకాల జబ్బుల బారిన పడుతున్నారని తెలిపారు. రైతాంగం సేంద్రియ వ్యవసాయం బాట పట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.






