- దమ్ముంటే సన్నబియ్యం పథకం ఆపండి
- మజ్లిస్ ఓట్ల కోసమే బీజేపీపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం
- సన్న బియ్యం ఇస్తుంది కేంద్ర ప్రభుత్వమే
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, మహా : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఓటర్లను బెదిరింపులకు గురిచేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. సన్నబియ్యం పథకాన్ని ఆపేస్తామని ముఖ్యమంత్రి ప్రజలను భయపెడుతున్నారని, దమ్ముంటే ఆ పథకాన్ని ఆపి చూడాలని సవాల్ విసిరారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం మీడియా మాట్లాడుతూ,
సన్నబియ్యం పథకం కాంగ్రెస్ది కాదు. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న ఉచిత బియ్యం పథకంలో భాగమని పేర్కొన్నారు. ఈ పథకంలో కేంద్రం కిలో బియ్యానికి రూ. 42 భరిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది కేవలం రూ. 15 మాత్రమే అని వివరించారు. ఈ వాస్తవాన్ని దాచిపెట్టి, పథకాన్ని ఆపేస్తామని బెదిరించడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు. ఓటు వేయకపోతే పథకాలు ఆపేస్తామని బెదిరించడంపై ఇప్పటికే బీజేపీ తరఫున ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మజ్లిస్ ఓట్లను దక్కించుకోవడానికే కాంగ్రెస్ పార్టీ బీజేపీపై విమర్శలు చేస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా అమలు చేస్తున్న ఏకైక పథకం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మాత్రమేనని ఆయన ఎద్దేవా చేశారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ప్రజలను బెదిరించేలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. బీజేపీని విమర్శించి మజ్లిస్ ఓట్లు పొందాలని కాంగ్రెస్ కొత్త కుట్రకు తెరలేపిందని మండిపడ్డారు. అమలుకు సాధ్యం కానీ హామీలు గుప్పించి.. దొడ్డి దారిన రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. హామీలన్నీ విస్మరించి ఒకే ఒక్క హామీని అమలు చేస్తున్నారు.. అదే ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా జూబ్లీహిల్స్లో బీజేపీ గెలుపు ఖాయమని జోస్యం చెప్పారు.








