- జీఎస్టీ ఎగవేత ఆరోపణలపై
- ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీ సునీల్ అరెస్ట్
- జీఎస్టీ ఎగవేత సంస్థలపై డీజీజీఐ దాడులు
హైదరాబాద్, మహా : హైదరాబాద్లో జీఎస్టీ ఎగవేతదారులపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) దాడులు ముమ్మరం చేసింది. ప్రయాణికులు, వినియోగదారుల నుండి పన్ను వసూలు చేసి, ఆ మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించకుండా మోసానికి పాల్పడిన రెండు ప్రముఖ సంస్థలపై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. ప్రముఖ ట్రావెల్స్ సంస్థ ఆరెంజ్ ట్రావెల్స్ సుమారు రూ. 28.24 కోట్ల మేర పన్ను ఎగవేసినట్లు గుర్తించగా, ట్రిలియన్ లీడ్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ సుమారు రూ. 22 కోట్ల జీఎస్టీ మొత్తాన్ని ప్రభుత్వానికి అందజేయలేదని అధికారులు నిర్ధారించారు.
ఈ రెండు సంస్థలు పన్ను చెల్లించాల్సిన గడువు ముగిసి 3 నెలలు గడుస్తున్నా నిబంధనలను అతిక్రమించడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా ఆరెంజ్ ట్రావెల్స్ యజమాని సునీల్ కుమార్, ట్రిలియన్ లీడ్ ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ చేతన్ను పోలీసులు అరెస్టు చేశారు. సీజీఎస్టీ (సీజీఎస్ టీ) చట్టం 2017 లోని నిబంధనల ప్రకారం పన్ను వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేయకపోవడం తీవ్రమైన నేరం కావడంతో, వీరిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పన్ను ఎగవేస్తున్న మరిన్ని సంస్థలపై సైతం డీజీజీఐ ఫోకస్ చేసింది.








