Mahaa Daily Exclusive

  మరోసారి సంచలనం రేపుతున్న సత్యం స్కామ్: రామలింగరాజు సహా 213 మందికి ఈడీ నోటీసులు

Share

  • మరోసారి తెరపైకి సత్యం కంప్యూటర్ స్కామ్
  • 213 మందికి ఈడీ నోటీసులు జారీ

హైదరాబాద్, మహా : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసిన సత్యం కంప్యూటర్ స్కామ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో తాజాగా మరోసారి సత్యం కంప్యూటర్స్ స్కామ్ తెరమీదకు వచ్చింది. ఈ కేసులో భాగమైన జన్వాడ భూముల వ్యవహారానికి సంబంధించి తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. జన్వాడ భూముల వ్యవహారంలో ఈడీ ప్రత్యేక కోర్టు సత్యం రామలింగరాజు, నందిని రాజు, తేజ రాజులతో పాటు 213 మందికి తాజాగా నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి నాంపల్లి ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి 27కి వాయిదా వేసింది. దీంతో రూ. 5000 కోట్ల విలువైన 97 ఎకరాల భూముల స్కామ్ వెలుగులోకి వచ్చే అవకాశం ఏర్పడింది.

హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న ఈ జన్వాడ భూముల కుంభకోణానికి సంబంధించి ఈడీ 2014లోనే కేసు నమోదు చేసింది. అప్పటి నుంచి ఈ కేసు కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో కేసులో ఏ-153 శతభిష కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్న తన స్టేట్‌మెంట్‌ను సాక్షిగా రికార్డ్ చేయాలంటూ ఏ-12 అభినవ్ అల్లడి అనే వ్యక్తి ఈ మధ్యే ఈడీ కోర్టులో పిటిషన్ వేశారు. జన్వాడ భూముల వ్యవహారంలో అసలేం జరిగిందో చెప్పడానికి తనకు అవకాశం ఇవ్వండి అంటూ శతభిష కంపెనీ సిబ్బంది ముందుకు రావడం సంచలనం సృష్టించింది. సత్యం కంప్యూటర్స్ స్కామ్ ద్వారా వచ్చిన డబ్బులో ఎక్కువ భాగాన్ని హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద పెద్ద స్థిరాస్తుల కొనుగోలుకు మళ్లించారని అభినవ్ ఆరోపించారు. దీనిపై తాజాగా విచారణ చేపట్టిన ఈడీ స్పెషల్ కోర్టు.. జన్వాడ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రామలింగరాజు, తేజ రాజు, నందిని రాజులతో పాటు 213 మందికి నోటీసులు జారీ చేసింది. దీనిపై సమాధానం చెప్పాలని ఆదేశించింది.

జన్వాడ కేసులో ఈడీ అనేక అక్రమ లావాదేవీలను గమనించిందని తెలిపిన అభినవ్ జన్వాడ గ్రామంలోని భూములతో సహా కొన్ని ఆస్తులను తమ విచారణలో సరిగ్గా పరిశీలించలేదని వాదించారు. జన్వాడలోని సర్వే నంబర్ 311/1, అకౌంట్ నంబర్ 60699 లో సుమారు 3.1 ఎకరాల భూమి, అలాగే సర్వే నంబర్ 306 నుండి 316 వరకు ఉన్న విస్తారమైన భూములను, సత్యం కంప్యూటర్స్ తో సంబంధం ఉన్న శతభిష కంపెనీ, దాని డైరెక్టర్లు చట్టబద్ధమైన లావాదేవీల ముసుగులో మోసపూరితంగా కొనుగోలు చేశారని ఆయన తెలిపారు. ఈ సర్వే నంబర్లలోని మొత్తం 90 ఎకరాల భూమి విలువ ప్రస్తుతం రూ. 5వేల కోట్లకు పైనే ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.

ఈ వ్యవహారంలో నిందితులు, ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులతో కుమ్మక్కై, రెవెన్యూ రికార్డులను తారుమారు చేశారని ఆరోపించారు. బినామీ లావాదేవీల ద్వారా నేరానికి సంబంధించిన డబ్బును మళ్లించి భారీ మొత్తంతో అనేక అక్రమ భూ బదిలీలు జరిపారని పిటిషనర్ ఆరోపించారు. జన్వాడ భూముల లావాదేవీల్లో నకిలీ, కల్పిత మ్యుటేషన్లు జరిగినట్లు తెలిపారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం, ఈ భూములను నేరానికి సంబంధించిన ఆస్తులుగా గుర్తించాల్సి ఉండగా కావాలనే కుట్రపూరితంగా అలా చేయలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. అసలు యజమానులతో తాను ఒప్పందాలు చేసుకుని పెద్ద మొత్తంలో చెల్లించానని.. అందువల్ల తాను కూడా ఈ మోసంలో బాధితుడినేనని పిటిషనర్ పేర్కొన్నారు. తన సాక్ష్యాన్ని రికార్డు చేయాలని కోరారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు విన్న కోర్టు.. సంబంధిత ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 27కి వాయిదా వేసింది.

సత్యం స్కామ్

2009కి ముందు వేలాది మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లతో తిరుగులేని ఐటీ శక్తిగా సత్యం కంప్యూటర్స్ ఎదిగింది. అమెరికాలో లిస్టెడ్ కంపెనీగా నమోదైంది. ఇలా ఉండగానే రామలింగరాజు షేర్ల ధరను పెంచి తప్పుడు బ్యాంక్ స్టేట్‌మెంట్లతో భారీ స్కామ్‌కు తెరతీశారు. దీంతో 2009లో కేసు నమోదైంది. ఆ తర్వాత ఈ కేసులో రామలింగరాజుతో పాటు మరికొందరికి జైలు శిక్ష, జరిమానా విధించారు.

Latest