Mahaa Daily Exclusive

  ట్రాఫిక్ పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు….

Share

  • ట్రాఫిక్ పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు
  • పెండింగ్ చలాన్లు చెల్లించాలని వాహనదారులను బలవంతపెట్టొద్దు
  • పెండింగ్ చలానాల వసూలుకు నోటీసులు ఇవ్వాలని ఆదేశం
  • బలవంతపు వసూళ్ళు చట్ట విరుద్దమన్న కోర్టు

హైదరాబాద్, మహా : తెలంగాణ హైకోర్టు ట్రాఫిక్ పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పౌరులను ఆపి బలవంతంగా ట్రాఫిక్ చలాన్లు చెల్లించాలని అడగొద్దని స్పష్టం చేసింది. పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను చెల్లించేందుకు బలవంతపెట్టొద్దని తెలిపింది. ‘ట్రాఫిక్ చలాన్లు చెల్లించాలనుకునే ఏ పౌరుడైనా తమకు నచ్చిన విధంగా చెల్లించవచ్చు. పోలీసులు చర్యలు తీసుకోవాలనుకుంటే వారికి నోటీసులు జారీ చేయాలి. తగిన ప్రక్రియను ఫాలో కావాలి. పెండింగ్‌లో ఉన్న చలాన్లు చెల్లించాలని, పోలీసులు వాహన కీలను లాక్కోవడం, మరే ఇతర బలవంతపు చర్యలు చేయకూడదు.’ అని హైకోర్టు పేర్కొంది.

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిబంధనలను అమలు చేయడానికి ఉపయోగించే పద్ధతులను సవాలు చేస్తూ సికింద్రాబాద్ నివాసి వి. రాఘవేంద్రచారి దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు విచారణ చేసింది. ట్రాఫిక్ పోలీసులు బలవంతంగా చలాన్లు వసూలు చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్, పోలీసులు వాహనదారులను ఆపకూడదని లేదా పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ జరిమానాలను అక్కడికక్కడే చెల్లించేలా వాహనాల తాళాలను తీసుకోవడం వంటి కఠినమైన చర్యలు చేయకూడదని కోర్టు పేర్కొంది.

పౌరులు తమ ఇష్టానుసారం జరిమానాలు చెల్లించవచ్చని కోర్టు స్పష్టం చేసింది. అయితే పోలీసులు చర్యలు తీసుకోవాలనుకుంటే.. కోర్టు నోటీసులు జారీ చేయవచ్చని తెలిపింది. చట్టపరమైన ప్రక్రియలను అనుసరించాలని పేర్కొంది. ట్రిపుల్ రైడింగ్ కోసం తనకు విధించిన రూ.1,235 జరిమానాను సవాలు చేస్తూ పిటిషనర్ గత ఏడాది నవంబర్‌లో హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ న్యాయవాది మోటారు వాహనాల చట్టం కింద నేరాలు కాంపౌండ్ చేయదగినవని, జరిమానా మొత్తాలను పేర్కొనే అధికారం రాష్ట్రానికి ఉందని వాదించారు.

రోడ్డు భద్రత దృష్ట్యా జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులను ప్రభుత్వం ప్రస్తావించింది. ఈ కేసు ప్రమాదకరమైన డ్రైవింగ్‌లోకి వస్తుందని, సెక్షన్ 184 కింద రూ. 1,000 జరిమానా విధిస్తారని పేర్కొంది. నవంబర్ విచారణ సందర్భంగా హైకోర్టు పోలీసులను ఆదేశించింది. పౌరులు జరిమానా విధించినప్పుడు వారు ఏ చట్టాన్ని ఉల్లంఘించారో వారికి తెలియజేయాలని ఆదేశించింది. పౌరులు తమకు జరిమానా విధించే చట్టపరమైన నిబంధనలను వీక్షించగలిగేలా ఈ-చలాన్ పోర్టల్‌ను అప్‌గ్రేడ్ చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చింది.

ప్రస్తుత విచారణలో పిటిషనర్ తన వాహనం ట్రాఫిక్ పోలీసులు తీసిన ఫోటోల ఆధారంగా మాత్రమే తనకు మూడు ట్రాఫిక్ చలాన్లు అందజేసినట్లు పేర్కొన్నారు. జరిమానాలు విధించడానికి పోలీసులు తమ వ్యక్తిగత మొబైల్ ఫోన్లు, హ్యాండ్ కెమెరాలు, ఇతర ధృవీకరించని పరికరాలను ఉపయోగించడం కంటే ప్రభుత్వం ఆమోదించిన, ధృవీకరించిన నిఘా కెమెరాలను మాత్రమే ఉపయోగించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు.

పోలీసులు వాహనాలను ఆపడానికి, జరిమానాలను పరిష్కరించడానికి అనుమతించే జీవో నెం. 108 చట్టబద్ధతను కూడా పిటిషనర్ సవాలు చేశారు. ఇది పోలీసులు న్యాయవ్యవస్థకు ఉన్న అధికారాలను ఉపయోగించుకోవడానికి అనుమతిస్తుంది అని అన్నారు. మరోవైపు ఇటీవలే ట్రాఫిక్ జరిమానాలను ఉల్లంఘించిన వారి బ్యాంకు ఖాతాల నుండి డైరెక్ట్‌గా చలాన్ల డబ్బులు కట్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని రోజుల తర్వాత పోలీసులు పౌరులను రోడ్డుపై ఆపి ట్రాఫిక్ జరిమానాలు చెల్లించమని బలవంతం చేయలేరు అని తెలంగాణ హైకోర్టు పేర్కొంది.

Latest