- ఎస్ఐఆర్కు ముందే బీఎల్ఏలను నియమించాలి
- సీఈఓ సుదర్శన్ రెడ్డి
- రాజకీయ పార్టీల నేతలతో సీఈవో భేటీ
హైదరాబాద్, మహా : రానున్న ప్రత్యేక సుదీర్ఘ సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – ఎస్ ఐఆర్)ను దృష్టిలో ఉంచుకుని, తెలంగాణలోని ప్రతి పోలింగ్ స్టేషన్కు కనీసం ఒక బూత్ లెవల్ ఏజెంట్ (బీఎల్ఏ)ను నియమించాలని రాజకీయ పార్టీలను తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సి. సుధర్శన్ రెడ్డి కోరారు. బూత్ స్థాయిలో బలమైన సమన్వయం ఈ ప్రక్రియకు కీలకమని ఆయన స్పష్టం చేశారు. ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఎల్ఏలను సాధ్యమైనంత వరకు ఆయా పోలింగ్ స్టేషన్ల పరిధిలోని స్థానికుల నుంచే ఎంపిక చేయాలని, వారు బూత్ లెవల్ అధికారులతో (బీఎల్ఓలు) సమన్వయంతో పనిచేయాలన్నారు. ఓటర్ల జాబితా సవరణ సమయంలో కచ్చితత్వం, పారదర్శకత, సమస్యల సకాల పరిష్కారం కోసం ప్రతి పోలింగ్ బూత్కు కనీసం ఒక బీఎల్ఏ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోందని, మిగతా రాష్ట్రాలు .. తెలంగాణ సహా వాటికి సంబంధించిన షెడ్యూల్ ఏప్రిల్ – మే 2026 మధ్య ప్రకటించే అవకాశం ఉందని వివరించారు. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత సమయం పరిమితంగా ఉండటంతో రాష్ట్రంలో ముందస్తు సన్నాహక పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని చెప్పారు. ఈ సన్నాహక చర్యల్లో భాగంగా, 2025 ఓటర్ల జాబితాలో ఉన్న ఓటర్లను 2002 ఎస్ఐఆర్లో నమోదైన ఓటర్లతో అనుసంధానించేలా టేబుల్టాప్ మ్యాపింగ్ చేపట్టామని తెలిపారు. అనంతరం ఫీల్డ్ స్థాయి మ్యాపింగ్ కొనసాగుతుండగా, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నివాసాలను గుర్తించి ధృవీకరించేందుకు బీఎల్ఓలు ఇంటింటి సర్వేలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.
‘ఎస్ఐఆర్ సమయంలో ప్రతి పోలింగ్ ప్రాంతాన్ని బీఎల్ఓలు మూడు నుంచి నాలుగు సార్లు సందర్శిస్తారని తెలిపారు. మొదటి సందర్శనలో ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తారు. తదుపరి సందర్శనల్లో ముందుగా అందుబాటులో లేని కుటుంబాలను కవర్ చేస్తారు. సన్నాహక దశలో మ్యాపింగ్ కాకపోయిన ఓటర్లు కూడా ఎస్ఐఆర్ సమయంలో తమ వివరాలు సమర్పించుకునే అవకాశం ఉంటుంది’ అని సీఈఓ స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీల పాత్రను మరోసారి గుర్తు చేస్తూ, అన్ని పోలింగ్ స్టేషన్లకు బీఎల్ఏల నియామకాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఈఓ కోరారు. బూత్ స్థాయిలో సమర్థవంతమైన పాల్గొనడం సమన్వయాన్ని బలోపేతం చేసి, ఫిర్యాదులను తగ్గించి, అర్హులైన ఏ ఒక్క ఓటరు కూడా ఓటర్ల జాబితా నుంచి తప్పిపోకుండా చేయడంలో సహాయపడుతుందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో అదనపు సీఈఓ వాసం వెంకటేశ్వర్ రెడ్డి, డిప్యూటీ సీఆర్ఓ హరి సింగ్ తదితర అధికారులు పాల్గొన్నారు







