- నేను ఎందుకు మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్నానా అని బాధపడుతున్నా
- అసెంబ్లీలో మల్లారెడ్డి ఆవేదన
- జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ పై ప్రభుత్వానికి మొర
హైదరాబాద్, మహా : మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి.. శాసనసభ వేదికగా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మేడ్చల్ నియోజకవర్గానికి అన్యాయం జరుగుతోందని అసెంబ్లీలో మొరపెట్టుకున్నారు. జవహర్నగర్ డంపింగ్ యార్డ్ సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించారు. మేడ్చల్ నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతాలను కూడా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో విలీనం చేశారని, అయితే అక్కడ సరైన వసతులు లేవని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీలో ఉన్న చెత్తను మొత్తం తీసుకువచ్చి.. తన మేడ్చల్ నియోజకవర్గంలోని జవహర్ నగర్లో డంప్ చేసి.. చెత్తకుప్ప లాగా మార్చారని ఆరోపించారు.
తన నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ నాలాలు, విద్యుత్ స్తంభాలు, అభివృద్ధి లేదని, రోడ్లు లేవని, లైట్లు లేవని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. స్పెషల్ కేటగిరీ కింద తమ మేడ్చల్ నియోజకవర్గానికి నిధులు కేటాయించాలని.. జిల్లా ఇంఛార్జ్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు దండం పెట్టి విజ్ఞప్తి చేశారు. జవహర్నగర్ డంపింగ్ యార్డు కారణంగా అక్కడి పరిస్థితి ఇప్పుడు అత్యంత దారుణంగా తయారైందని మల్లారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరం నలుమూలల నుంచి సేకరించిన చెత్త మొత్తాన్ని జవహర్ నగర్కే తీసుకువస్తున్నారని తెలిపారు. ఈ చెత్త కారణంగా అక్కడ నివసించే ప్రజలు వాసన భరించలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. అక్కడి వాతావరణం కారణంగా స్థానికులు ఆస్పత్రుల పాలు అవుతున్నారని మల్లారెడ్డి తెలిపారు. వాళ్లను చూసి తన మనసు చలించిపోతోందని పేర్కొన్నారు. తాను ఎందుకు మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్నానా అని బాధపడుతున్నానని ఎమోషనల్ అయ్యారు. తక్షణమే ప్రభుత్వం జవహర్నగర్ డంపింగ్ యార్డును స్పెషల్ కేటగిరీ కింద డెవలప్ చేయాలని మల్లారెడ్డి కోరారు.
దేశంలోనే నెంబర్ వన్ నియోజకవర్గమైన తన మేడ్చల్ను ముక్కలు చేశారని మల్లారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 61 గ్రామాలు.. 3 కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీలు ఉండేవి కానీ ప్రస్తుత ప్రభుత్వం వాటిని మొత్తం జీహెచ్ఎంసీలో కలిపి కేవలం 16 వార్డులుగా మార్చిందని ఆరోపించారు. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో పెంకుటిళ్లులే ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా ఇంఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబును ఉద్దేశించి మాట్లాడిన మల్లారెడ్డి.. ‘శ్రీధరన్నా.. జర నాపై పగబట్టకే.. మా జిల్లా ఇంఛార్జ్ మంత్రివి నువ్వే’ అని విజ్ఞప్తి చేశారు.






